ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 1-2తో వెనుకంజలో నిలిచిన టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం నుంచి మాంచెస్టర్ వేదికగా జరిగే నాలుగో టెస్ట్లో ఆతిథ్య ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. 11 ఏళ్ల తర్వాత మాంచెస్టర్ వేదికగా టీమిండియా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. అయితే ఈ మైదానంలోని భారత రికార్డ్స్ అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ మైదానంలో భారత్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మొత్తం 9 మ్యాచ్లు ఆడిన భారత్ ఐదు మ్యాచ్లు డ్రా చేసుకొని నాలుగింటిలో ఓడింది. ఈ రికార్డ్స్ నేపథ్యంలోనే నాలుగో టెస్ట్లో టీమిండియా గెలిచి చరిత్ర తిరగరాస్తుందా? లేదా మరో పరాజయాన్ని ఎదుర్కొంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో భారత్ తమ తొలి మ్యాచ్ను 1936లో ఆడింది. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2014లో చివరిసారిగా ఇక్కడ మ్యాచ్ జరగ్గా.. అందులో ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 11 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో మరో మ్యాచ్ ఆడబోతున్న టీమిండియా చరిత్ర తిరగరాస్తుందా? మరో ఘోర పరాజయం ఎదురువుతుందా? అనే ప్రశ్న అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ మైదానంలో భారత్ అత్యధిక స్కోర్ 432. 1990లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఈ భారీ స్కోర్ నమోదు చేసింది. 1952లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 58 పరుగులకే ఆలౌటైంది. ఇదే ఈ మైదానంలో భారత్ అత్యల్ప స్కోర్. 1990లో మహ్మద్ అజారుద్దీన్ చేసిన 179 పరుగులే.. భారత బ్యాటర్ల నుంచి ఈ మైదానంలో టాప్ స్కోర్. 1982లో దిలీప్ దోషి (6/102) ఈ మైదానంలో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేశాడు.

ఈ మైదానంలో ఇంగ్లండ్కు మెరుగైన రికార్డ్ ఉంది. ఇప్పటి వరకు ఇక్క 81 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఇంగ్లండ్ 33 గెలిచి 15 మ్యాచ్ల్లో ఓడింది. మరో 36 మ్యాచ్లను డ్రా చేసుకుంది. భారత్ ఇక్కడ తొమ్మిది మ్యాచ్లు ఆడిన ఇంగ్లండ్.. ఒక్క మ్యాచ్లో కూడా ఓడలేదు. నాలుగు గెలిచి 5 డ్రా చేసుకుంది. 2019 నుంచి మాంచెస్టర్లో ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ మైదానంలో జో రూట్, బెన్ స్టోక్స్కు మెరుగైన రికార్డ్ ఉంది. ఇక్కడ 11 మ్యాచ్లు ఆడిన జోరూట్.. 65.20 సగటుతో 978 పరుగులు చేశాడు. బెన్ స్టోక్స్ యావరేజ్ 52.63తో 579 పరుగులు చేశాడు. బౌలింగ్లో క్రిస్ వోక్స్ 35 వికెట్లు తీసాడు.
ఎడ్జ్బాస్టన్లోనూ టీమిండియాకు మెరుగైన రికార్డు లేదు. కానీ ఈ మైదానం వేదికగా రెండో టెస్ట్లో టీమిండియా విజయం సాధించింది. చరిత్ర తిరగరాయడం తమ పనని మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. మాంచెస్టర్లో కూడా అదే సంస్కృతి కొనసాగిస్తారో లేదో చూడాలి.