
సిడ్నీ: కామెరోన్ గ్రీన్(173 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో 114 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించడంతో టీమిండియా టెస్ట్ టీమ్తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియా-ఏ జట్టు పై చేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఆసీస్-ఏ ఫస్ట్ ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు చేసింది. ఫలితంగా 39 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. గ్రీన్కి తోడుగా కెప్టెన్ టీమ్ పైన్(44), నెసర్(33) రాణించారు. ప్రస్తుతం క్రీజులో గ్రీన్తో పాటు స్టెక్టీ(1 బ్యాటింగ్) ఉన్నాడు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్(3/44) మూడు వికెట్లు తీయగా.. హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్(2/71), సీనియర్ స్పిన్నర్ అశ్విన్(2/58) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు 237/8 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ టెస్ట్ టీమ్.. 247/9 వద్ద డిక్లేర్ చేసింది. సిరాజ్(0) పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఆ వెంటనే భారత్ డిక్లేర్ ఇచ్చింది. కెప్టెన్ అజింక్యా రహానే(117 నాటౌట్), కార్తీక్ త్యాగీ(1 నాటౌట్) అజేయంగా నిలిచారు.
అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్-ఏకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్.. ఆసీస్-ఏ ఓపెనర్లు విల్ పుకోవిస్కీ(1), జో బర్న్స్(4)ను వరుస ఓవర్లలో ఔట్ చేశాడు. దాంతో ఆసీస్ 5 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సిరాజ్, అశ్విన్ వికెట్లు తీయడంతో 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన క్రిస్ గ్రీన్ జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ టీమ్ పైన్తో కలిసి ఆరో వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టును గట్టెక్కించాడు. టీమ్ పెయిన్ను ఉమేశ్ ఔట్ చేయడంతో ఈ భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత నెసెర్తో కలిసి గ్రీన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. నెసర్ను సిరాజ్ రనౌట్ చేయడంతో ఆసీస్-ఏ 8 వికెట్ కోల్పోయింది. మంగళవారం చివరి రోజు కాగా.. ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక సెంచరీతో ఆదుకున్న క్రీస్ గ్రీన్పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది.