
అందుకే విశ్రాంతా?
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో తొలి రెండు టీ20ల నుంచి రోహిత్ శర్మకు టీమ్మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. అయితే రోహిత్ గైర్హాజరీలో బరిలోకి దిగిన భారత్ తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దాంతో రోహిత్కు విశ్రాంతి ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫామ్లో ఉన్న ఆటగాడికి విశ్రాంతినిస్తారా? అని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.
మరోవైపు మ్యాచ్కు ప్రారంభానికి ముందే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగానే తొలి రెండు మ్యాచ్లకు హిట్మ్యాన్ను పక్కన పెట్టామని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అయినా విమర్శలు ఆగలేదు. ఇక సెకండ్ టీ20కైనా రోహిత్ వస్తాడని అంతా భావించారు. కానీ శిఖర్ ధావన్ను పక్కనబెట్టిన టీమ్మేనేజ్మెంట్ ఇషాన్ కిషాన్ను ఓపెనర్గా బరిలోకి దింపింది. అంతేకాకుండా అక్షర్ పటేల్ను తీసేసీ మరో బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్కు అవకాశం ఇచ్చింది.
నక్కినక్కి..
ఇక ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 7 వికెట్లతో గెలుపొంది 5 టీ20ల సిరీస్ను 1-1తో సమం చేసింది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమిండియా డగౌట్లో కూర్చున్న రోహిత్ శర్మ.. టీమిండియా సపోర్ట్ స్టాఫ్ చాటున నక్కినక్కి ఏదో తినడం కెమెరాకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సహచర ఆటగాళ్లు మైదానంలో కష్టపడుతుంటే, నువ్వేంటి రోహిత్ ఇలా అని ఒకరంటే.. వడాపావ్ కోసమే రెస్ట్ తీసుకున్నట్లున్నాడని మరొకరు ఘాటుగా కామెంట్ చేశారు.

తిండి మీదున్న సోయి..
తిండి మీదున్న సోయి ఫిట్నెస్ మీద లేదని మరొకరు విమర్శించారు. దాంతో ఈ వీడియో వైరల్గా మారింది. మరోవైపు రోహిత్ ఫ్యాన్స్ మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. రోహిత్ టీంలో లేకుంటే ఆ లోటు స్పష్టంగా కనబడుతుందని, కానీ కావాలనే ఈ స్టార్ ఓపెనర్ను తప్పించి కోహ్లీ 'గేమ్స్' ఆడుతుంటే వాటిని పక్కనపెట్టి ఇలా తిండి గురించి కామెంట్ చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇస్మార్ట్ ఇషాన్..
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (35 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం భారత్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసి గెలిచింది. కోహ్లీ (49 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. విధ్వంసకర ఆటతో చెలరేగిన ఇషాన్ కిషాన్ (32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 56)కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. మూడో మ్యాచ్ రేపు ఇదే వేదికపై జరుగుతుంది.


Click it and Unblock the Notifications
