ఇంగ్లండ్తో మూడో టెస్ట్లో టీమిండియా కొత్త బంతిని మార్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంతి నుంచి స్వింగ్, సీమ్ లభించినా టీమిండియా బంతిని మార్చడం విచిత్రకరంగా అనిపించిందని నాజర్ హుస్సేన్, దినేష్ కార్తీక్ వంటి మాజీ క్రికెటర్లు అన్నారు. బంతిని మార్చడంతో టీమిండియాకు తీరని నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. మారిన బంతితో ఇంగ్లండ్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ నమోదు చేసిందని, బంతిని మార్చకుండా ఉంటే టీమిండియానే పైచేయి సాధించేదని నాజర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు.
బంతి మార్పు నిర్ణయం జస్ప్రీత్ బుమ్రాకు నచ్చలేదని, మహమ్మద్ సిరాజ్ సూచనలతోనే శుభ్మన్ గిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపించిందని దినేష్ కార్తీక్ తెలిపాడు. 'బంతి మార్పు కాస్త విచిత్రంగా అనిపించింది. బంతి బాగానే స్వింగ్ అయ్యింది. బహుషా ఈ టెస్ట్ మ్యాచ్లోనే ఎక్కువగా స్వింగ్ అయిన బాల్ ఇదే అనుకుంట. నిలకడగా సీమ్ కూడా లభించింది. భారత ఆటగాళ్లు ఆ బంతితో 63 బంతులు వేయగా.. అందులో చాలా వరకు స్వింగ్ అయ్యాయి. అయితే భారత ఆటగాళ్ల మధ్య జరిగిన చర్చ ఏంటో నాకు తెలియదు. కానీ మహమ్మద్ సిరాజ్ సూచనలతోనే శుభ్మన్ గిల్ బంతిని మార్చినట్లు అనిపించింది. ఈ నిర్ణయం బుమ్రాకు నచ్చలేదన్నట్లు కనిపించింది.'అని దినేష్ కార్తీక్ తెలిపాడు.

లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో కొత్త బంతితో బుమ్రా నిప్పులు చెరిగాడు. వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసాడు. అయితే కొత్త బంతిని తీసుకున్న తర్వాత 10 ఓవర్ల వ్యవధిలోనే బంతి ఆకారం దెబ్బతిన్నదని, మార్చాలని టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అంపైర్ను కోరాడు.
గిల్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న అంపైర్.. బంతిని మార్చాడు. అయితే మార్చిన బంతి 10 ఓవర్ల పాత బంతిలా లేదని, 20 ఓవర్ల పాత బంతిలా ఉందని అంపైర్తో శుభ్మన్ గిల్ వాగ్వాదానికి దిగాడు. సిరాజ్ కూడా మార్చిన బంతి సరిగ్గా లేదని అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పాత బంతితో సీమ్, స్వింగ్ రాకపోవడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టారు. 271 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. బంతి మార్పు కారణంగా అదనంగా 116 పరుగులు చేసి 387 పరుగులకు ఆలౌటైంది. దాంతో బౌలింగ్కు అనుకూలంగా ఉన్న బంతిని మార్చి టీమిండియా మూల్యం చెల్లించుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.