బుచ్చిబాబు టోర్నీలో హైదరాబాద్ క్రికెట్ టీమ్ దుమ్మురేపుతోంది. వరుసగా రెండో విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మధ్యప్రదేశ్ జట్టుతో గురువారం ముగిసిన గ్రూప్-ఏ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 229 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్.. తొలి ఇన్నింగ్స్లో 74.5 ఓవర్లలో 207 పరుగులకు కుప్పకూలింది. శుభమ్ కుశ్వత్(48) టాప్ స్కోరర్గా నిలవగా.. హైదరాబాద్ బౌలర్లో తనయ్ త్యాగరాజన్(3/59), అనికేత్ రెడ్డి(3/55) మూడేసి వికెట్లతో మధ్యప్రదేశ్ పతనాన్ని శాసించారు. కార్తీకేయ, రవితేజ తలో వికెట్ తీయగా.. రోహిత్ రాయుడు(2/31) రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ను 129.3 ఓవర్లలో 560/6 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ అభిరథ్(243 బంతుల్లో 24 ఫోర్లు, 3 సిక్స్లతో 211) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతనికి తోడుగా హిమ తేజ(50), వరుణ్ గౌమ్(63 నాటౌట్), రవితేజ(54 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ తిలక్ వర్మ(18) తీవ్రంగా నిరాశపరిచాడు.
అనంతరం 353 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ 47 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. దాంతో హైదరాబాద్కు ఇన్నింగ్స్ 229 పరుగుల భారీ తేడాతో విజయం దక్కింది. మరోసారి శుభమ్ కుశ్వత్(44) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి(5/46) ఐదు వికెట్లతో మధ్యప్రదేశ్ ఓటమిని శాసించగా.. తనయ్ త్యాగరాజన్(3/35) మూడువికెట్లు తీసాడు. కెప్టెన్ తిలక్ వర్మ, రోహిత్ రాయుడు తలో వికెట్ దక్కించుకున్నారు.
ఈ టోర్నీలో గ్రూప్-ఏలో ఉన్న హైదరాబాద్ వరుసగా రెండు విజయాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. తొలి మ్యాచ్లో జార్ఖండ్ను ఓడించిన హైదరాబాద్.. రెండో మ్యాచ్లో మధ్యప్రదేశ్ను చిత్తు చేసింది. ఈ వరుస విజయాలతో గ్రూప్-ఏ నుంచి హైదరాబాద్ సెమీఫైనల్ చేరగా.. గ్రూప్ బీ నుంచి తమిళనాడు ప్రెసిడెంట్స్ ఎలెవన్ ముందంజ వేసింది. మిగతా గ్రూప్స్ మ్యాచ్ల ఫలితాలు తేలాల్సి ఉంది.