ఆలిండియా బుచ్చి బాబు టోర్నీలో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో అసాధారణ ప్రదర్శనతో హైదరాబాద్ టైటిల్ కైవసం చేసుకుంది. ఛత్తీస్ఘడ్తో బుధవారం ముగిసిన ఫైనల్లో హైదరాబాద్ 243 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
518 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఛత్తీస్ఘడ్ 274 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఆయుష్ పాండే(134 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 117) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. అతనికి తోడుగా మరో ఓపెనర్ శశాంక్ చంద్రకర్(45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు.

హైదరాబాద్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్(5/61) ఐదు వికెట్లతో ఛత్తీస్ఘడ్ పతనాన్ని శాసించాడు. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అనికేత్ రెడ్డి(2/55) రెండు వికెట్లు తీయగా.. రోహిత్ రాయుడు, నితేష్ కన్నాల, తన్మయ్ అగర్వాల్ తలో వికెట్ తీసారు.
రోహిత్ భారీ శతకం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 118.4 ఓవర్లలో 417 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ రాయుడు(260 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లతో 155) భారీ శతకం నమోదు చేయగా... ఓపెనర్ అభిరథ్(126 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 85) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. రాహుల్ రాదేష్(48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం హైదరాబాద్ బౌలర్లు నిప్పులు చెరగడంతో ఛత్తీస్ఘడ్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకే కుప్పకూలింది. అనికేత్ రెడ్డి(4/56), తనయ్ త్యాగరాజన్(3/40), రోహిత్ రాయుడు(3/36) ఛత్తీస్ఘడ్ పతనాన్ని శాసించారు. గగన్ దీప్ సింగ్(59 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. దాంతో హైదరాబాద్కు తొలి ఇన్నింగ్స్లో 236 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
ఈ భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ 70.2 ఓవర్లలో 281 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ సింగ్(68) హాఫ్ సెంచరీతో రాణించగా.. రాహుల్ రాదేష్(41) విలువైన పరుగులు చేశాడు. ఛత్తీస్ఘడ్ బౌలర్లలో జీవేష్ బుట్టే(6/56) ఆరు వికెట్లతో సత్తా చాటాడు.
ఇక రంజీట్రోఫీనే..
రంజీ ట్రోఫీ 2024 ప్లేట్ గ్రూప్లో విజేతగా నిలిచిన హైదరాబాద్..ఎలైట్ డివిజన్కు అర్హత సాధించింది. తాజాగా బుచ్చిబాబు టోర్నీ గెలిచి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. ముంబై వంటి ప్రతిష్టాత్మక జట్లు పాల్గొన్న బుచ్చి బాబు టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాలు నమోదు చేసింది. అప్కమింగ్ డొమెస్టిక్ సీజన్ ముందు సాధించిన ఈ విజయం హైదరాబాద్ జట్టుపై అంచనాలను పెంచుతున్నాయి.
WE DID IT!
— Jagan Mohan Rao Arishnapally (@JaganMohanRaoA) September 11, 2024
🏆🎉 After 7 long years, Hyderabad emerges victorious in the All India Buchi Babu Invitational Cricket Tournament conducted by Tamilnadu Cricket Association.
Hearty congratulations to the entire team for this historic win against Chhattisgarh! Your hard work and… pic.twitter.com/SGQskMSqVN