Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించి అధికారం కైవసం చేసుకుంది. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావించిన బీఆర్ఎస్కు చుక్కెదురైంది. ఈ ఊహించని ఓటమి నేపథ్యంలో బీఆర్ఎస్ అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. వన్డే ప్రపంచకప్ ఫైనల్తో పాటు అధికారం పోయిందని కామెంట్ చేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టీమిండియా జైత్రయాత్రను ఉద్దేశించి బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'టీమిండియా ప్రపంచకప్ గెలవడం.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా'అని అన్నారు. నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా ఓటమిపాలై తృటిలో టైటిల్ చేజార్చుకోగా.. తాజాగా బీఆర్ఎస్ కూడా ఓడి మూడోసారి అధికారం కోల్పోయింది.

దాంతో కేటీఆర్ కామెంట్స్ను గుర్తు చేసుకుంటూ ఆ పార్టీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల వ్యవధిలో రెండు సార్లు ఊహించని ఫలితాలు ఎదురయ్యాయని, ఈ ఏడాది అత్యంత బ్యాడ్గా సాగిందని బాధను వ్యక్తం చేస్తున్నారు.
119 నియోజకవర్గాలున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో అధికారం చేజిక్కించుకోగా..బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 8 సీట్లు గెలవగా.. ఎంఐఎం ఏడు, సీపీఐ ఒకటి గెలిచింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్కు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శుభాకాంక్షలు చెప్పారు. ట్విటర్ వేదికగా ఆయన కాంగ్రెస్తో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అఖండ విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేశారు.