భారత దేశవాళీ స్టార్ సర్ఫరాజ్ ఖాన్, అతని సోదరుడు ముషీర్ ఖాన్ శతకాలతో మెరిసారు. ఇద్దరూ ఒకే రోజు తమ స్థాయి క్రికెట్ టోర్నీల్లో సత్తా చాటారు. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్లో భారత జట్టు తరఫున బరిలోకి దిగిన ముషీర్ ఖాన్.. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 106 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 118 పరుగులు చేశాడు.
ముషీర్ ఖాన్ భారీ శతకంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత అండర్ -19 టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 301 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్కు తోడుగా కెప్టెన్ ఉదయ్ శరణ్(84 బంతుల్లో 5 ఫోర్లతో 75) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ 45 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది.

ఇక ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరుగుతున్న అనధికారిక రెండో టెస్ట్లో భారత్ ఏ తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఖాన్ భారీ శతకం బాదాడు. 160 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్స్లతో 161 పరుగులు చేశాడు. యాదృశ్చికమో ఏమో కానీ అన్నదమ్ములిద్దరూ ఒకే రోజు శతకాలు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఇద్దరి ప్రదర్శనపై క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అతి త్వరలోనే ఈ ఇద్దరూ టీమిండియాకు ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్కు తోడుగా దేవదత్ పడిక్కల్(126 బంతుల్లో 17 ఫోర్లతో 105) సెంచరీ సాధించడంతో భారత్ ఏ తొలి ఇన్నింగ్స్లో 493 పరుగులకు ఆలౌటైంది.
గత రెండు, మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా సర్ఫరాజ్ ఖాన్కు టీమిండియా నుంచి పిలుపు రావడం లేదు. దాంతో అతను చాలా సందర్భాల్లో సెలెక్టర్లపై అసహనం వ్యక్తం చేశాడు. సునీల్ గవాస్కర్ వంటి ఆటగాళ్లు సైతం సర్ఫరాజ్ ఖాన్కు అవకాశం ఇవ్వాలని సూచించినా బీసీసీఐ సెలెక్టర్లు పట్టించుకోలేదు.