ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(39 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 46) టాప్ స్కోరర్గా నిలవగా.. అభిషేక్ శర్మ(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 28), శివమ్ దూబే(18 బంతుల్లో ఫోర్, సిక్స్తో 23), సూర్యకుమార్ యాదవ్(10 బంతుల్లో 2 సిక్స్లతో 20) దూకుడుగా ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా మూడేసి వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్లెట్, మార్కస్ స్టోయినిస్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్(24 బంతుల్లో 4 ఫోర్లతో 30), మాథ్యూ షార్ట్(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, శివమ్ దూబే రెండేసి వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్(3/3) మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 శనివారం బ్రిస్బేన్ వేదికగా జరగనుంది.

168 పరుగుల లక్ష్యచేధనలో ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. ముఖ్యంగా భారత స్పిన్నర్ల ధాటికి పెవిలియన్కు క్యూ కట్టారు. దూకుడుగా ఆడిన మాథ్యూ షార్ట్(25)ను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో పవర్ ప్లేలో ఆసీస్ వికెట్ నష్టానికి 48 పరుగులే చేసింది. అనంతరం జోష్ ఇంగ్లీస్(12)ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చగా.. క్రీజులో సెట్ అయిన మిచెల్ మార్ష్(30) శివమ్ దూబే ఔట్ చేశాడు.
దూకుడుగా ఆడే ప్రయత్నంలో టీమ్ డేవిడ్(14) దూబే బౌలింగ్లో క్యాచ్ ఔటవ్వగా.. జోష్ ఫిలిప్(10) అర్ష్దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. మార్కస్ స్టోయినీస్(17), గ్జేవియర్ బార్ట్లెట్(0)ను వాషింగ్టన్ సుందర్ తన వరుస ఓవర్లలో ఔట్ చేయగా.. డేంజరస్ గ్లేన్ మ్యాక్స్వెల్ను వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేశాడు. బెన్ ద్వార్షూయిస్(5)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆడమ్ జంపా(0)ను సుందర్ పెవిలియన్ చేర్చాడు. దాంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది.