దుబాయ్లోనే..?
ప్రస్తుతం భారత్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్లోనే నిర్వహించే అవకాశం ఉందన్న బ్రిజేశ్ పటేల్.. 60 మ్యాచ్ల పూర్తిస్థాయి ఐపీఎల్ నిర్వహణకే ప్రయత్నిస్తామన్నారు. ‘వారం నుంచి పది రోజుల్లో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అవుతుంది. ఐపీఎల్కు సంబంధించిన అన్ని నిర్ణయాలు ఈ భేటిలో తీసుకుంటాం. ప్రస్తుతానికైతే 60 మ్యాచ్లతో కూడిన పూర్తి స్థాయి ఐపీఎల్ నిర్వహించాలనుకుంటున్నాం. దుబాయ్ వేదికగా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రేక్షకులు అనుమతి లేదు కాబట్టి ఎక్కడా జరిగినా వచ్చే నష్టమేం లేదు. ఇక ప్రభుత్వ అనుమతినైతే కోరుతాం'అని బ్రిజేశ్ పటేల్ అన్నారు.
స్టార్స్పోర్ట్స్ డిమాండ్:
మొత్తం 44 రోజుల వ్యవధిలో 60 మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీలు, ప్రసారదారు స్టార్ ఇండియాకు బీసీసీఐ తెలియజేసింది. అయితే టోర్నీని మరో వారం రోజులు పొడిగించాలని స్టార్స్పోర్ట్స్ డిమాండ్ చేస్తోంది. అందుకు కారణం దీపావళి పండగ. ఒకవేళ నవంబరు 15 వరకూ టోర్నీ జరిగితే.. పండగ సీజన్ కావడంతో యాడ్స్ రూపంలో మరింత ఆదాయం చేకూరుతుందని స్టార్స్పోర్ట్స్ భావిస్తోంది. అయితే బీసీసీఐ మాత్రం స్టార్స్పోర్ట్స్ రిక్వెస్ట్ని పక్కన పెడుతోంది.
క్రికెటర్లకి క్యాంప్:
ఒకవేళ నవంబరు 15 వరకూ ఐపీఎల్ 2020 జరిగితే.. డిసెంబరు 3న ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న నాలుగు టెస్టుల సిరీస్కి సిద్ధమయ్యేందుకు భారత ఆటగాళ్లకు చాలా తక్కువ సమయం ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది. యూఏఈ వేదికగా ఐపీఎల్కి కేంద్ర ప్రభుత్వం పర్మీషన్ ఇవ్వగానే.. క్రికెటర్లకి అక్కడ ఓ క్యాంప్ని ఏర్పాటు చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.
ఐపీఎల్ ఆతిథ్యానికి రెడీ..
ఐపీఎల్ 2020 లీగ్ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నారన్న వార్తలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దుబాయ్ స్పోర్ట్స్ సిటీ చీఫ్ సల్మాన్ హనీఫ్ స్పందించాడు. 'ఐపీఎల్ 2020ని దుబాయ్ వేదికగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ఐసీసీ అకాడమీ, స్పోర్ట్స్ సిటీలోనే ఉన్నాయి. స్టేడియంలో తొమ్మిది పిచ్లు ఉన్నాయి. ఒకవేళ తక్కువ సమయంలో ఎక్కువ మ్యాచ్లు నిర్వహించినా ఎటువంటి నష్టం ఉండదు' అని అన్నారు. ఐసీసీ కాంప్లెక్స్లో ప్రాక్టీస్ కోసం 38 నెట్ వికెట్లు ఉన్నట్లు హనిఫ్ తెలిపారు.