
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తడబడుతోంది. భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆ జట్టు భారీ స్కోర్లు చేయడంలో సతమతమవుతోంది. బ్యాటింగ్ పరంగా ఆ జట్టు ఈ సీజన్లో ఒక్క మెరుగైన ప్రదర్శన కూడా లేదు. చెన్నై వేదికగా జరిగిన ఐదు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై..ఒక్కసారి కూడా 160 పరుగుల స్కోరును దాటలేదు.
దాంతో ఈ ఐదు మ్యాచుల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఆ రెండు విజయాలను కూడా బౌలింగ్ బలగంతోనే గట్టెక్కింది.
రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్..భారీ అంచనాలతో ఈ సీజన్ను ఆరంభించి అనూహ్యంగా తడబడుతుండటంపై వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా ఆందోళన వ్యక్తం చేశాడు.
'ఇది ఎలాంటి టోర్నమెంటో చెప్పడం నాకు చాలా కష్టంగా ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) లాంటి విజయాలు సాధించిన జట్లు ఏ వేదికకైనా ఆత్మవిశ్వాసంతో వెళ్తాయని భావిస్తున్నా. ఆత్మవిశ్వాసం లేని జట్లు వేదికలను, అక్కడి పిచ్లను సమస్యలుగా చూస్తాయి. ముంబై ఇండియన్స్ ప్రదర్శన నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు ఆ జట్టు మరో వేదికై ఢిల్లీకి వెళ్లింది. అక్కడ కూడా పిచ్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. వారు అక్కడ ఏ విధమైన ప్రదర్శన చేస్తారో చూడాలి? అని స్టార్ స్పోర్ట్స్ షోలో బ్రియాన్ లారా చెప్పుకొచ్చాడు.
పంజాబ్ కింగ్స్తో ఓటమి అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తమ టీమ్గా మైదానంలో పూర్తిస్థాయి ప్రదర్శన కనబర్చడం లేదన్నాడు. ఇలాంటి కఠిన పిచ్లపై ఎలా బ్యాటింగ్, బౌలింగ్ చేయాలనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. తమ బ్యాటింగ్లో ఎదో మిస్సవుతుందని చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ చేతిలో ఓడి ఈ సీజన్ను ప్రారంభించిన ముంబై ఆ తర్వాత కేకేఆర్, సన్రైజర్స్ హైదరాబాద్పై అద్బుత విజయాన్నందుకుంది. అనంతరం ఢిల్లీ, పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది. ఇక గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది.