న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్, కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్పై వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల జల్లు కురిపించాడు. సమీప భవిష్యత్తులో ఉమ్రాన్ మాలిక్ భారత్ క్రికెట్ను ఏలుతాడని జోస్యం చెప్పాడు. సన్రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్, మెంటార్గా ఉమ్రాన్ మాలిక్ ఆటను దగ్గర నుంచి చూసిన లారా.. అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమవడంతో ఆ జట్టు బ్రియాన్ లారాను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది. కొత్త కోచ్గా న్యూజిలాండ్ దిగ్గజం డానియల్ వెటోరిని నియమించుకుంది. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో టీ20 సిరీస్ ఆడుతుండగా.. తొలి మూడు టీ20ల్లో ఉమ్రాన్ మాలిక్కు చోటు దక్కలేదు.

తాజాగా ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడిన బ్రియాన్ లారా.. ఉమ్రాన్ మాలిక్కు మంచి భవిష్యత్తు ఉందని, అయితే అతను పేస్ను మాత్రమే నమ్ముకోకుండా బౌలింగ్లో వేరియేషన్స్ నేర్చుకోవాలని తెలిపాడు. 'ఉమ్రాన్ మాలిక్.. టీమిండియాలో సెన్సెషనల్ బౌలర్. అయితే అతను పేస్ బౌలింగ్ ఏ మాత్రం బ్యాటర్లను ఇబ్బంది పెట్టదనే విషయాన్ని అతను వీలైనంత త్వరగా నేర్చుకోవాలి.
పరిస్థితులకు తగ్గట్లు ఎలా బౌలింగ్ చేయాలో తెలసుకోవాలి. కొన్ని ట్రిక్స్ నేర్చుకోవాలి. వసీం అక్రమ్, మాల్కోలమ్ మార్షల్, మిచెల్ హోల్డింగ్ లాంటి దిగ్గజాలు పేస్తో పాటు కొన్ని ట్రిక్స్తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవారు. అలాంటి సామర్థ్యాన్ని ఉమ్రాన్ మాలిక్ అందిపుచ్చుకోవాలి. అతను కుర్రాడే కాబట్టి కాలం గడుస్తున్నా కొద్దీ రాటు దేలుతాడు.

డేల్ స్టెయిన్ లాంటి దిగ్గజ బౌలర్ పర్యవేక్షణలో ఆడిన ఉమ్రాన్ మాలిక్... అతని నుంచి ఎన్నో మెలకువలు నేర్చుకునే ఉంటాడు. బ్యాటర్ల ఫుట్ వర్క్ ను బట్టి బంతులను సంధించడం వంటి విషయాలు ఉమ్రాన్కు బాగా తెలుసు. అతను మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తూ.. కొద్దిగా ఓపిక వహిస్తే భవిష్యత్తులో టీమిండియా ప్రధాన పేసర్గా ఎదుగుతాడు.'అని బ్రియాన్ లారా చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్తో జరిగే నాలుగో టీ20లో ఉమ్రాన్ మాలిక్కు చోటు దక్కవచ్చు. ముకేష్ కుమార్ స్థానంలో అతను తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఫ్లోరిడా వేదికగా శనివారం ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మూడు టీ20ల్లో టీమిండియా రెండు మ్యాచ్ల్లో ఓడిన విషయం తెలిసిందే.