2006 విండీస్ టూర్లో..
2006 విండీస్ పర్యటనలో భాగంగా సెయింట్ జోన్స్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్ 241 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మినహా(49) అంతా విఫలమయ్యారు. అనంతరం లారా నేతృత్వంలో విండీస్ 371 పరుగులు చేసి 130 పరుగుల లీడ్ సాధించింది. క్రిస్ గేల్(72), డ్వేన్ బ్రావో(68),రామ్నరేశ్(58) రాణించారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మన్ జూలు విధిల్చారు. ఓపెనర్ వసీం జాఫర్(399 బంతుల్లో 24 ఫోర్లు, సిక్స్తో 212) డబుల్ సెంచరీతో చెలరేగగా.. సెహ్వాగ్(41), లక్ష్మణ్(31), యువరాజ్(39), రాహుల్ ద్రవిడ్(62) ఫర్వాలేదనిపించడంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లింది.

హ్యాట్రిక్ సిక్సర్లతో...
మహ్మద్ కైఫ్తో జత కలిసిన మహేంద్ర సింగ్ ధోనీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విండీస్ స్పిన్నర్ డేవ్ మహ్మద్ను లక్ష్యంగా చేసుకొని వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తనదైన హెలీక్యాప్టర్ షాట్లతో బంతిని బౌండరీకి తరలించాడు. పదే పదే స్టెప్ ఔట్ అవుతూ భారీ సిక్సర్లు కొట్టాడు. ఇక డేవ్ మహ్మద్ వేసిన 151వ ఓవర్లో ధోనీ హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్ రెండో బంతిని ఓవర్ లాంగాన్ మీదుగా సిక్సర్ కొట్టిన ధోనీ.. మరుసటి బంతిని క్రీజు ధాటి మైదానం బయట పడేశాడు. నాలుగో బంతిని ఓవర్ లాంగ్ లెగ్ దిశగా మరో సిక్సర్ బాదాడు. అదే జోరులో ఐదో బంతిని డీప్ మిడ్ వికెట్మీదుగా భారీ షాట్ ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న డారెన్ గంగా బౌండరీ లైన్పై బంతిని అందుకున్నాడు. ఇక ఇక్కడే అసలు డ్రామా మొదలైంది.

ధోనీతో లారా గొడవ..
తొలుత ఔట్గా భావించిన ధోనీ.. మైదానం వీడేందుకు సిద్దమయ్యాడు. కానీ అంపైర్లు క్యాచ్పై సందేహం వ్యక్తం చేస్తూ థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. క్యాచ్ అందుకునే క్రమంలో గంగా బౌండరీ లైన్ తాకినట్లు రిప్లేలో కనిపించింది. టీవీ అంపైర్ పలు కోణాల్లో పరిశీలించినా ఔటైనట్లు స్పష్టత రాలేదు. దాంతో అంపైర్లు బెన్ఫిట్ ఆఫ్ బ్యాట్స్మన్ కింద నాటౌటిచ్చారు. కానీ ధోనీ సిక్సర్లతో అప్పటికే విసిగిపోయిన లారా.. తన ఫీల్డర్ చెప్పే మాటలు నమ్మాలని, అతను బౌండరీ లైన్ తాకలేదని స్పష్టంగా చెబతున్నాడని వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ధోనీతో కూడా లారా ఆర్గ్యూ చేశాడు.

డిక్లేర్ ఇచ్చిన ద్రవిడ్..
ఇదంతా డ్రెస్సింగ్ రూమ్ నుంచి గమనించిన అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్.. ఈ వివాదం పెద్దది గాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించడంతో గొడవ సద్దుమణిగింది. అయితే లారా విజ్ఞప్తికి ధోనీ అంగీకరించడంతో ఫీల్డర్ మాటలను పరిగణలోకి తీసుకున్న అంపైర్లు ఔటిచ్చారు. భారీ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్.. 298/9తో ఓటమి నుంచి గట్టెక్కింది. ఇక ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా.. సిరీస్ను భారత్ 1-0తో గెలుచుకుంది. అయితే ధోనీ-లారా మధ్య జరిగిన గొడవ మాత్రం క్రికెట్ చరిత్రలో అలానే నిలిచిపోయింది.


Click it and Unblock the Notifications












