
అల్ అమెరట్: అలనాటి క్రికెటర్లతో రసవత్తరంగా సాగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఇండియా మహారాజాస్ కథ ముగిసింది. వరుస ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరల్డ్ జెయింట్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో ఇండియా మహారాజస్ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(21 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 56) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినా ఫలితం దక్కలేదు. ఆఖరి ఓవర్లో మహరాజస్ విజయానికి 8 పరుగులు అవసరం కాగా.. ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ సూపర్ బౌలింగ్తో పఠాన్ ఔట్ చేసి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. హెర్షెల్ గిబ్స్(46 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్లతో 89), ఫిల్ మస్టర్డ్(33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. మహారాజాస్ బౌలర్లలో మునాఫ్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. స్టువర్ట్ బిన్నీ, రజత్ భాటియా, ఇర్ఫాన్ పఠాన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇండియా మహారాజాస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఇర్ఫాన్ పఠాన్కు తోడుగా ఓపెనర్ నమన్ ఓజా(51 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 95), యూసుఫ్ పఠాన్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 45) రాణించినా ఫలితం లేకపోయింది.
229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాజాస్.. ఆదిలోనే వసీం జాఫర్, సుబ్రమణ్యం బద్రీనాథ్ వికెట్లను కోల్పోయింది. అనంతరం నమన్ ఓజా (95), యూసుఫ్ పఠాన్ (45) రెండో వికెట్కు 103 పరుగులు జోడించడంతో మహారాజాస్ విజయం లాంఛనమే అంతా భావించారు. యూసుఫ్ పఠాన్ వికెట్ కోల్పోవడంతో మహారాజాస్ వికెట్ల పతనం మొదలైంది.
కాగా చివర్లో ఇర్ఫాన్ పఠాన్ సిక్సర్ల వర్షం కురిపించడంతో మహారాజాస్ విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే అఖరి ఓవర్లో 8 పరుగుల కావల్సిన నేపథ్యంలో పఠాన్ ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 20 ఓవర్ వేసిన బ్రెట్లీ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి జెయింట్స్ను విజయతీరాలకు చేర్చాడు.