టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రానే వరల్డ్ బెస్ట్ పేసర్ అని కొనియాడాడు. ఆసీస్ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రానే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడని ప్రశంసించాడు. అతనికి దారిదాపుల్లో కూడా మరో బౌలర్ లేడని, అసాధారణ ప్రదర్శనతో ఇతర బౌలర్ల గణంకాలను బుమ్రా కనుమరుగు చేశాడని అభిప్రాయపడ్డాడు.
ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇరు జట్లలో జస్ప్రీత్ బుమ్రానే అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేశాడు. మూడు టెస్ట్ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. గబ్బా టెస్ట్లో 9 వికెట్లు తీసిన బుమ్రా.. బ్యాటింగ్లోనూ సత్తా చాటి మ్యాచ్ డ్రా అవ్వడంలో కీలక పాత్ర పోషించి భారత్కు ఓటమి తప్పించాడు.

తొలి టెస్ట్లో 8 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్న బుమ్రా.. పింక్ బాల్ టెస్ట్లోనూ 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే బుమ్రాపై బ్రెట్ లీ ప్రశంసల జల్లు కురిపించాడు. మహమ్మద్ షమీ లోటును భర్తీ చేసేందుకు మహమ్మద్ సిరాజ్ ప్రయత్నిస్తున్నాడని తెలిపాడు.
'జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్. దురదృష్టవశాత్తు టీమిండియాకు మహమ్మద్ షమీ లేడు. ఎన్ని విమర్శలు వచ్చినా షమీ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిరాజ్ ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచంలోనే భారత్కు అత్యుత్తమ బౌలింగ్ దళం ఉంది. కానీ బుమ్రా అత్యుత్తమ ప్రదర్శనతో ఇతర బౌలర్లు రాణించడం లేదని, అతనే భారత బౌలింగ్ భారాన్ని మోస్తున్నాడని జనాలు అనుకుంటున్నారు. మిగతా బౌలర్లకు అందనంత దూరంలో బుమ్రా నిలిచాడు. ఇతర బౌలర్లను కించపర్చడం నా ఉద్దేశం కాదు. కానీ బుమ్రా అత్యుత్తమం.'అని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు 53 వికెట్లు తీసిన బుమ్రా.. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ను బుమ్రా అధిగమించాడు. బుమ్రాకు అండగా రాణించడంలో సిరాజ్ తడబడుతుండగా.. ఆకాశ్ దీప్, హర్షిత్ రాణాల విషయంలో మేనేజ్మెంట్ అయోమయానికి గురవుతోంది. మెలోబోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ గెలవడమే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఆసీస్ తమ జట్టులో భారీ మార్పులు చేసింది. టీమిండియా కూడా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది.