
సిడ్నీ: కరోనా రక్కసితో అల్లాడుతున్న భారత్కు మరో ఆస్ట్రేలియా క్రికెటర్ అండగా నిలిచాడు. నిన్న ఆ దేశ స్టార్ పేసర్, కోల్కతా నైట్రైడర్స్ ప్లేయర్ కమిన్స్ భారత్ కోసం 50 వేల డాలర్ల విరాళం ప్రకటించగా.. నేడు అతని సీనియర్ ప్లేయర్, దిగ్గజ పేసర్ బ్రెట్ లీ సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న భారత్ కు ఒక బిట్ కాయిన్ విరాళంగా ఇస్తున్నట్టు బ్రెట్ లీ ప్రకటించాడు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఒక బిట్ కాయిన్కు భారత కరెన్సీలో రూ.40.95 లక్షల విలువ ఉంది. తన విరాళం గురించి బ్రెట్ లీ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన చేశాడు.
భారత్ తనకు రెండో ఇల్లని, ఇక్కడి ప్రజలు చూపించి ప్రేమ, ఆప్యాయతలు తన మదిలో పదిలంగా ఉంటాయని పేర్కొన్నాడు. 'నాకు భారత్ రెండో ఇల్లులాంటిది. నేను క్రికెటర్గా ఉన్నప్పుడు, రిటైర్ అయిన తర్వాత కూడా ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయతలకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రస్తుతం మహమ్మారి ధాటికి భారత ప్రజలు అల్లాడుతున్న తీరు తీవ్ర విచారం కలిగిస్తోంది. ఈ పరిస్థితి పట్ల స్పందించి నా వంతుగా సాయం చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నాను. భారత్లో కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా కోసం ఒక బిట్ కాయిన్ ను క్రిప్టో రిలీఫ్ (www.cryptorelief.in) సంస్థకు విరాళంగా ప్రకటిస్తున్నాను.
ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికి అందరం ఏకమవ్వాల్సిన సమయం ఇది. ఈ కష్టకాలంలో ముందుండి నిలిచి పోరాడుతున్న కొవిడ్ యోధులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొవిడ్ పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలి. భారత్ను ఆదుకునేందుకు ముందుకు రావాలని చొరవ చూపిన ప్యాట్ కమిన్స్ను మనస్పూర్తిగా అభినందిస్తున్నా'అని బ్రెట్ లీ తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఇక భారత్కు అండగా నిలిచిన బ్రెట్లీకి అభిమానులు, మాజీ క్రికెటర్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు.