లార్డ్స్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో శుభారంభం దక్కకపోయినా.. తమ అప్రోచ్లో ఎలాంటి మార్పు ఉండదని ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ అన్నాడు. లార్ట్స్ వేదికగా జరిగే రెండో టెస్ట్లో మరింత దూకుడుగా ఆడుతామని తెలిపాడు. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది.
బజ్బాల్ గేమ్తో దూకుడుగా ఆడిన ఇంగ్లండ్.. చివరకు అదే ఆటతీరుతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్ను త్వరగా డిక్లేర్డ్ చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్లో ధాటిగా ఆడే క్రమంలో స్వల్ప స్కోరే నమోదు చేసింది. ఇంగ్లండ్ చేజేతులా పరాజయం పాలైందని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.
బజ్బాల్ క్రికెట్తో పాటు కాస్త తెలివిగా కూడా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

ఈ విమర్శలను పట్టించుకొని ఇంగ్లండ్ టీమ్ మాత్రం దూకుడే తమ మంత్రమని స్పష్టం చేసింది. ఇప్పటికే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటతీరును మార్చుకొనే ప్రసక్తే లేదని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్స్ తెలపగా.. తాజాగా కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ అవే వ్యాఖ్యలు చేశాడు.
'మా ఆటతీరు ఇంకా దూకుడుగా ఉంటుంది. బజ్బాల్ 2.0 చూపించేందుకు ప్రయత్నిస్తాం. టెస్ట్ క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మా ఆట తీరు ఉపయోగపడుతుంది. ఆసీస్ తమ ఆట తీరుతో విజయం సాధించింది. వారు వ్యూహాలను కొనసాగించాలని భావిస్తారు. ఇక మేం కూడా మా ప్రణాళికలతో బరిలోకి దిగుతాం.
దూకుడుగా ఆడటం వల్ల టెస్టు క్రికెట్ రసవత్తరంగా మారుతుంది. లార్డ్స్ టెస్టులో మేం ఇంకాస్త దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తాం. విజయం సాధించడానికి అవసరమైన అన్ని చేస్తాం. చాలామంది దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు చేస్తుంటారు. దూకుడుగా ఆడటం వల్ల టెస్టు మ్యాచ్ను చూసేందుకు అభిమానులకు ఆసక్తి పెరుగుతుంది.
హెవీ వెయిట్ బాక్సింగ్ పోటీలనే తీసుకుంటే ప్రతి ఒక్కరూ ఒకేలా ఫైట్ చేయరు. ఇది కూడా సేమ్ టు సేమ్. ప్రపంచవ్యాప్తంగా టెస్టు క్రికెట్పై ఆసక్తి పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆసీస్ తమ వ్యూహాలను అమలు చేసి విజయవంతమైంది. మేం కూడా ఇలానే ఆడి గెలుస్తాం' అని మెక్కల్లమ్ చెప్పుకొచ్చాడు. జూన్ 28 నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.