ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) పరిమిత ఓవర్ల ఫార్మాట్కు కొత్త కోచ్ను నియమించింది. ప్రస్తుతం టెస్ట్ టీమ్ కోచ్గా ఉన్న బ్రెండన్ మెక్కల్లమ్కు ప్రమోషన్ ఇస్తూ వైట్ బాల్ హెడ్ కోచ్గా నియమించింది. ఈ మేరకు ఈసీబీ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
2022 మేలో టెస్ట్ టీమ్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన మెక్కల్లమ్.. ఈసీబీ తాజా నిర్ణయంతో 2027 వరకు మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ హెడ్ కోచ్గా కొనసాగనున్నాడు. వచ్చే ఏడాది భారత పర్యటనతో మెక్కల్లమ్ వైట్బాల్ హెడ్ కోచ్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ ఆడనున్న తదుపరి వైట్ బాల్ సిరీస్ల్లో మార్కస్ ట్రెస్కోథిక్ తాత్కలిక కోచ్గా వ్యవహరించనున్నాడు.

ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో పాటు వెస్టిండీస్తో వైట్బాల్ సిరీస్లు ఆడనుంది. మెక్ కల్లమ్ను హెడ్ కోచ్గా నియమించడంపై ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ సంతోషం వ్యక్తం చేశాడు.
'ఇంగ్లండ్ హెడ్ కోచ్గా బ్రెండన్ మెక్కల్లమ్ పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉంది. అతనిలాంటి కోచ్ ఇంగ్లండ్ క్రికెట్కు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. వచ్చే సిరీస్ల్లో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నాం. గత రెండేళ్లుగా వేర్వేరు ఫార్మాట్లకు జట్లను కొనసాగించడం సవాల్గా మారింది. ఇప్పుడు మూడు ఫార్మాట్లకు ఒకే కోచ్ను నియమించడం.. మంచి ఫలితాలను ఇస్తోందని ఆశిస్తున్నాం.'అని రాబ్ కీ చెప్పుకొచ్చాడు.
2022లో ఇంగ్లండ్ వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. వైట్బాల్ ఫార్మాట్లకు మాథ్యూ మోట్ను హెడ్ కోచ్గా నియమించిన ఈసీబీ.. టెస్ట్ టీమ్కు మెక్కల్లమ్ను తీసుకుంది. మాథ్యూ మోట్ పర్యవేక్షణలోని ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ 2022లో విజేతగా నిలిచింది. అయితే వన్డే ప్రపంచకప్ 2023తో పాటు టీ20 ప్రపంచకప్ 2024లో దారుణంగా విఫలమైంది. దాంతో ఈసీబీ మళ్లీ తమ నిర్ణయాన్ని మార్చుకొని మూడు ఫార్మాట్లకు ఒకే కోచ్ను నియమించింది.