
సిడ్నీ: పేలవ ఫామ్తో సతమతమవుతున్న టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా స్థానంలో యువ ఓపెనర్ పృథ్వీ షాను ఆడించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్నర్ బ్రాడ్ హగ్ సూచించాడు. ప్రస్తుతం అతను ఇంగ్లండ్ పర్యటనలో లేకున్నా రప్పించాలన్నాడు. న్యూజిలాండ్తో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో పుజారా దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి కేవలం 23 రన్స్ మాత్రమే చేశాడు. అది భారత్ విజయవకాశాలను దెబ్బతీసింది.
అయితే మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. కొంత మంది ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతేకాకుండా టెస్ట్ టీమ్ను ప్రక్షాళన చేస్తామని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిర్భయంగా ఆడగలిగే ఆటగాళ్లను తీసుకొస్తామన్నాడు. పరిమిత ఓవర్ల జట్టు మాదిరి బలమైన జట్టును తయారు చేస్తామని చెప్పాడు. కోహ్లీ ప్రత్యేకంగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. పుజారా వైఫల్యం తెరపైకి వచ్చింది. అప్కమింగ్ ఐదు టెస్ట్ల సిరీస్లో అతనిపై వేటు పడవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుజారా ప్లేస్లో కేఎల్ రాహుల్కు అవకాశం దక్కవచ్చంటున్నారు.
ఇదే విషయాన్ని ఓ అభిమాని ట్విటర్ వేదికగా బ్రాడ్ హగ్ దృష్టికి తీసుకెళ్లగా అతను భిన్నంగా స్పందించాడు. పుజారా ప్లేస్లో రాహుల్కు బదులు పృథ్వీషానే సరైనవాడని పేర్కొన్నాడు. 'చతేశ్వర్ పుజారా స్థానాన్ని ఎవరితోనైనా భర్తీ చేయాలనుకుంటే దానికి సరైన వాడు పృథ్వీ షా. ఓపెనింగ్ కన్నా ఆ ప్లేస్కు అతను సరిగ్గా సరిపోతాడు. అతనికి మంచి నైపుణ్యంతో పాటు సుదీర్ఘ భవిష్యత్తు ఉంది. ప్రస్తుతం అతను ఇంగ్లండ్ పర్యటనలో లేకపోవచ్చు. కానీ వైల్డ్ కార్డ్ చాయిస్గానైనా అతన్ని తీసుకొచ్చి ఆడించాలి'అని బ్రాడ్ హగ్ పేర్కొన్నాడు.
పృథ్వీషాకు ఇంగ్లండ్ పర్యటనలోని కోహ్లీసేన నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీలంక పర్యటనలో ఉన్న అతడిని ఇంగ్లాండ్కు పంపించాలని బీసీసీఐ భావిస్తోందట. గాయపడిన శుభ్మన్ గిల్ స్థానాన్ని అతడితో భర్తీ చేయాలన్నది జట్టు యాజమాన్యం ఉద్దేశంగా తెలుస్తోంది. శుభ్మన్ గిల్ ఎడమ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడని, 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసమరని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. దాంతో అతను ఇంగ్లండ్తో సిరీస్ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, అభిమన్యు ఈశ్వరన్ శుభ్మన్కు ప్రత్యామ్నాయంగా జట్టులో ఉన్నారు. కానీ సుదీర్ఘ సిరీస్ కావడంతో వీరిలో ఎవరైనా గాయపడే అవకాశం ఉందని, ముందు జాగ్రత్తగా పృథ్వీ షాను పిలుపించే అవకాశం ఉన్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి.