
న్యూఢిల్లీ: అప్ కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెంబర్ 3లో బ్యాటింగ్ చేయవద్దని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ సూచించాడు. రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేయాలని.. మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడాలని చెప్పాడు. శ్రీలంకతో ఆదివారం ముగిసిన మూడు టీ20ల సిరీస్లో అత్యద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్.. నెం.3లో బ్యాటింగ్ చేసి మూడు మ్యాచ్ల్లోనూ వరుసగా 54*, 74*, 73* పరుగులతో సత్తాచాటాడు. విరాట్ కోహ్లీకి ఈ సిరీస్లో రెస్ట్ ఇవ్వగా.. అతని స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయాస్ అయ్యర్ సిరీస్లో ఒక్కసారి కూడా లంక బౌలర్లకి వికెట్ ఇవ్వకపోవడం విశేషం.
శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురుస్తుండగా.. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న టీ20 వరల్డ్కప్లో అతన్నే నెం.3లో ఆడించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఇప్పటి వరకూ వన్డే, టీ20ల్లో నెం.3లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. కానీ.. 2019, నవంబరు నుంచి సెంచరీ కోసం నిరీక్షిస్తున్న కోహ్లీ అంచనాల్ని అందుకోలేకపోతున్న విషయం తెలిసిందే. మునపటిలా సత్తా చాటలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని ఓపెనర్గా ఆడించాలని బ్రాడ్ హగ్ సూచించాడు.
'టీ20 వరల్డ్కప్ 2022కి విరాట్ కోహ్లీని జట్టులో కొనసాగిస్తే? అతన్ని ఓపెనర్గా ఆడించాలి. రోహిత్ శర్మతో కలిసి అతను ఇన్నింగ్స్ ప్రారంభించాలి. ఇక నెం.3లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4లో రిషభ్ పంత్ను ఆడిస్తే జట్టుకు మంచిది. అవసరమనుకుంటే కేఎల్ రాహుల్ని కూడా నెం.4లో ట్రై చేయవచ్చు. అలానే హార్దిక్ పాండ్యా జట్టులో ఉంటే.. అప్పుడు జడేజా నెం.6లో లేదా నెం.7లో ఆడించాలి'' అని బ్రాడ్ హగ్ సూచించాడు. ఈ ఏడాది అక్టోబరులో టీ20 వరల్డ్కప్ ప్రారంభంకానుంది.
అత్యద్భుతమైన పేసర్లు భారత జట్టు సొంతమని బ్రాడ్ హగ్ కొనియాడాడు. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో టీమిండియా బలంగా కనిపిస్తోందని, బెంచ్ కూడా చాలా బలంగా ఉందని తెలిపాడు. రోహిత్ సారథ్యంలోని భారత జట్టును ఓడించడం ఇతర జట్లకు సవాల్తో కూడుకున్నదని చెప్పాడు.