పేలవ ఫామ్తో సతమతమవుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ కీలక సలహా ఇచ్చాడు. కాస్త దూకుడు తగ్గించుకోవాలని సూచించాడు. భావోద్వేగాలను అదుపులుపెట్టుకొని బ్యాటింగ్ చేయాలని హితవు పలికాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నాడు. 11 ఇన్నింగ్స్లు ఆడి ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శ్రీలంకతో వన్డే సిరీస్, బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్తో పాటు న్యూజిలాండ్ జరుగుతున్న టెస్ట్ సిరీస్లోనూ తేలిపోయాడు.
తొలి టెస్ట్లో హాఫ్ సెంచరీ సాధించినా.. ఆ జోరును కొనసాగించలేకపోయాడు. ముఖ్యంగా అతని వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీస్తోంది. మరీ ముఖ్యంగా స్పిన్నర్లకు ఔటవుతుండటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

తాజాగా కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యంపై స్పందించిన బ్రాడ్ హగ్.. దూకుడుగా ఆడాలనే ప్రయత్నంలో కోహ్లీ విఫలమవుతున్నాడని అభిప్రాయపడ్డాడు. ఓపికగా బ్యాటింగ్ చేయాలని సూచించాడు. అలాగే న్యూజిలాండ్ను టీమిండియా చాలా తేలికగా తీసుకుందని, అందుకే ఊహించని పరాజయం ఎదుర్కొందని తెలిపాడు.
'న్యూజిలాండ్ను భారత్ చాలా తేలిగ్గా తీసుకుంది. సులువుగా విజయం సాధించవచ్చని భావించి మూల్యం చెల్లించుకుంది. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడాడు. వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నించాడు. ప్రత్యర్థి బౌలింగ్ను చాలా తేలికగా తీసుకున్నాడు. భారీ షాట్స్ ఆడే సమయంలో కోహ్లీ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. అందుకే స్పిన్ బౌలింగ్లో కోహ్లీ ఔటయ్యాడు.
మూడో టెస్ట్లోనైనా కోహ్లీ తన టెక్నిక్ను మెరుగుపర్చుకోవాలి. టీమ్ సౌథీ బౌలింగ్లో రోహిత్ శర్మ ఇబ్బంది పడ్డాడు. మూడో టెస్ట్లో టీమిండియా విజయం సాధించాలంటే రోహిత్, కోహ్లీ రాణించడం ముఖ్యం.
అయితే ఈ వరుస పరాజయాలు టీమిండియా మంచికే. ఎందుకంటే మున్ముందు ఆ జట్టు నుంచి నాణ్యమైన ఆటతీరు వస్తుంది. ఈ సిరీస్లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. విజయం కోసం విభిన్నమైన వ్యూహాలతో రావాలి. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చేనాటికి భారత్ సిద్ధమవ్వాలి. లేకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ గల్లంతవుతోంది. భారత్కు అదే చివరి టెస్ట్ సిరీస్ కాబట్టి విజయాలు సాధించడం చాలా కీలకం.'అని బ్రాడ్ హాగ్ చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్తో మూడో టెస్ట్ శుక్రవారం నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే టీమిండియా పరువు దక్కడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ అవకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో భారత్, ఆస్ట్రేలియా టాప్-2లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు న్యూజిలాండ్తో చివరి మ్యాచ్లోనూ ఓడితే మాత్రం టీమిండియా పరిస్థితి క్లిష్టంగా మారుతోంది.