
సిడ్నీ: శ్రీలంక పర్యటనకు వెళ్లిన శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు అత్యంత పటిష్టంగా ఉందని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్హగ్ అన్నాడు. అది ఏ మాత్రం ద్వితీయ శ్రేణి జట్టు కాదని, ప్రపంచంలోని అన్ని ప్రథమశ్రేణి జట్లను ఓడించే సామర్థ్యం ఆ జట్టుకు ఉందన్నాడు. శ్రీలంక క్రికెట్లో సమస్యలు ఉన్నాయని, అందుకే వారు అలా మాట్లాడుతున్నారని అర్జున రణతుంగ కామెంట్స్ను పరోక్షంగా ప్రస్తావించాడు.
ఇక విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే శిఖర్ ధావన్ సారథ్యంలోని మరో జట్టును పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆటగాళ్లపై మానసిక ఒత్తిడి తగ్గించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ టూర్ సక్సెస్ అయితే భవిష్యత్తులోనూ ఏకకాలంలో ఇలా రెండు జట్లను ఆడించాలని భావిస్తోంది.
అయితే ఇలా ద్వితీయ శ్రేణి జట్టును పంపించి తమ దేశ క్రికెట్ను అవమానపరిచారని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. బలహీనమైన జట్టుతో రెండో సిరీస్కు అంగీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే అర్జున వ్యాఖ్యలను మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తప్పుపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఓ అభిమాని ట్విటర్ వేదికగా భారత్, శ్రీలంక వన్డే, టీ20 సిరీస్లపై అంచనాలను తెలియజేయాలని కోరగా.. హగ్ గబ్బర్ సేనపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టుపై ఆతిథ్య దేశం ఫిర్యాదు చేస్తుందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో ఉన్న జట్లనూ గబ్బర్ సేన ఓడించగలదు. శ్రీలంక క్రికెట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. భారత్ వన్డే, టీ20 సిరీసులు కచ్చితంగా గెలుస్తుంది.
రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లను క్రమశిక్షణతో ఆడించగలడు' అని బ్రాడ్హగ్ అన్నాడు. సూర్యకుమార్ యాదవ్ సైతం తమది ద్వితీయ శ్రేణి జట్టు అనుకోవడం లేదని, సిరీసులను ఆస్వాదించేందుకే ఇక్కడికి వచ్చామని, రణతుంగ కామెంట్స్ పట్టించోమని తెలిపాడు. ఇప్పటికే శ్రీలంకలో అడుగుపెట్టి సన్నాహకాలు ప్రారంభించిన గబ్బర్ సేన.. జూలై 13 నుంచి ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది.