
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్గా సత్తా చాటుతున్న రోహిత్ శర్మకు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అసలు సిసలు సవాల్ అని మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ అన్నాడు. కెప్టెన్సీ కెరీర్ను రోహిత్ శర్మ అద్భుతంగా ప్రారంభించాడని కొనియాడిన ఈ ఆసీస్ మాజీ ప్లేయర్.. అగ్రశ్రేణి జట్లతో ఆడినప్పుడు రోహిత్ కెప్టెన్సీ స్కిల్స్ బయటపడతాయన్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్తో పాటు సొంతగడ్డపై జరిగే టెస్ట్ సిరీస్ రోహిత్ శర్మకు అతి పెద్ద సవాల్ అని పేర్కొన్నాడు.
'త్వరలో ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. అది రోహిత్ శర్మకు కఠిన సవాల్గా మారనుంది. నేను అతనిని ఒత్తిడిలో చూడాలనుకుంటున్నాను. ఆ సమయంలో ఇప్పటి లాగే ప్రశాంతమైన బాడీ లాంగ్వేజ్ని కలిగి ఉంటాడా లేదా మనం అతన్ని కోపాన్ని చూస్తామా? భారత్ స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్, ఇంగ్లండ్ పర్యటన, ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్లో పాల్గొననుంది. కాబట్టి రాబోయే అన్నీ టోర్నీలు రోహిత్ శర్మకు కఠినమైనవే'అని బ్రాడ్ హాగ్ చెప్పుకొచ్చాడు.
మూడు ఫార్మాట్లలో ఫుల్టైమ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన ఫస్ట్ సిరీస్ల్లోనే క్లీన్ స్వీప్ విజయాలు అందుకున్న తొలి సారథిగా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. సౌతాఫ్రికా పర్యటనలో భారత సిరీస్ ఓటమి అనంతరం టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. దాంతో సారథిగా అతని శకం ముగియగా.. అప్పటికే పరిమిత ఓవర్ల సారథిగా ఉన్న రోహిత్ శర్మకు టీమిండియా ఫుల్ టైమ్ కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది. ఇక ఫుల్ టైమ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్తో వన్డే, టీ20 సిరీస్లు ఆడిన భారత్.. ఈ రెండు సిరీస్లను 3-0తో క్లీన్ స్వీప్ చేసుకుంది. శ్రీలంకతో టీ20 సిరీస్ను 3-0తో, టెస్ట్ సిరీస్ను కూడా 2-0తో గెలవడంతో కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ అరుదైన గుర్తింపు దక్కింది.