
న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించే సత్తా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకే ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ అన్నాడు. కరోనా కారణంగా ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడటంతో ఢిల్లీ జట్టుకు కలిసొచ్చిందని పేర్కొన్నాడు. భుజం గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమైన శ్రేయస్ అయ్యర్, కరోనా కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకున్న సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్లు తిరిగి జట్టులోకి వచ్చారని, దాంతో ఆ జట్టు మరింత బలోపేతమైందని అభిప్రాయపడ్డాడు. భారత్ వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 2021 ఎడిషన్ కరోనా వైరస్ దెబ్బకు అర్థంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.
ఇక సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం జరిగే ఫస్ట్ మ్యాచ్తో ఈ ధనాధన్ లీగ్ సందడి మొదలవ్వనుంది. ఈ క్రమంలోనే తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఐపీఎల్ 2021 గురించి మాట్లాడిన బ్రాడ్ హగ్.. ముంబై ఇండియన్స్ ఆరో టైటిల్ గెలవకుండా అడ్డుకునే సత్తా ఒక్క ఢిల్లీ క్యాపిటల్స్కే ఉందన్నాడు.
'డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో టైటిల్ గెలవకుండా అడ్డుకోగల సత్తా ఒక్క ఢిల్లీ క్యాపిటల్స్కే ఉంది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ రాకతో ఢిల్లీ క్యాపిటల్స్ మరింత బలోపేతమైంది. ఇకపై ఆ జట్టు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్పై భారం వేయాల్సిన అవసరం లేదు. మరోవైపు, బౌలింగ్ విభాగంలో యువ సంచలనం అవేశ్ ఖాన్ ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్లో 14 వికెట్లు తీసి ఢిల్లీ విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. కోచ్ రికీ పాటింగ్ ప్రోత్సాహంతో అతను మరింత రాటుదేలాడు. ప్రస్తుతం ఆ జట్టులో సమతూకం కనిపిస్తోంది' అని బ్రాడ్ హగ్ తెలిపాడు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో ఆ జట్టు ఆరు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ఉన్నాయి.