
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే ఈ టోర్నీ గురించి చర్చ జోరందుకుంది. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులతో పాటు సోషల్ మీడియా వేదికగా అభిమానులు మెగా టోర్నీ విజేతలను అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ సైతం తన ఫేవరేట్ జట్లను ప్రకటించాడు. ట్విటర్ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చాడు.
'బ్రాడ్ హగ్.. టీ20 ప్రపంచకప్లో నీ ఫేవరేట్ జట్లు ఏంటివి?'అని ఓ అభిమాని ప్రశ్నించగా.. న్యూజిలాండ్, ఇంగ్లండ్ అని బ్రాడ్ హగ్ బదులిచ్చాడు. 'ఇంగ్లండ్, న్యూజిలాండ్ ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ జట్లు. టైటిల్ గెలుచుకునే రేసులో ఈ రెండు జట్లే ముందుంటాయి. అయితే, ఆ రెండు జట్లను ఓడించే సత్తా భారత జట్టుకు ఉంది.'అని బ్రాడ్ హగ్ పేర్కొన్నాడు.
కాగా ఇంగ్లండ్ 2010 లో టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. అదే విధంగా.. ఇటీవల శ్రీలంక ,పాకిస్తాన్లతో జరిగిన టీ20 సీరీస్లో విజయం సాధించి హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగనుంది. మరో వైపు శ్రీలంక, బంగ్లాదేశ్లతో ఇటీవల జరిగిన టీ20 సిరీసిల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఓటమి చెందాయి. శ్రీలంక చేతిలో భారత్ అనూహ్య పరిస్థితుల్లో సిరీస్ కోల్పోగా.. బంగ్లాదేశ్ చేతిలో న్యూజిలాండ్ సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీతో ఓటమిపాలైంది. ముందుగా బీ టీమ్తో బరిలోకి దిగిన భారత్.. కరోనా నేపథ్యంలో ప్రధాన ఆటగాళ్ల సేవలను కోల్పోయి మూల్యం చెల్లించుకుంది.
టీ20 ప్రపంచకప్ గ్రూప్ 2 లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీనీ బీసీసీఐనే ఆర్గనైజ్ చేయనుంది. కరోనా నేపథ్యంలోనే ఈ మెగాటోర్నీనీ యూఏఈకి తరలించారు. ఈ ఏడాది అక్టోబర్ 17న టీ20 ప్రపంచకప్ 2021 ఆరంభం కానుంది. క్వాలిఫైర్ మ్యాచుతో మెగా టోర్నీ మొదలవుతుంది. రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమన్, పపువా న్యూ గినియా మ్యాచ్తో టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 23న అసలు టోర్నీ అంటే.. సూపర్ 12 స్టేజ్ ప్రారంభమవుతుంది. అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి.

అదే రోజు దుబాయ్లో సాయంత్రం ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు ఢీ కొననున్నాయి. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్లో తొలి మ్యాచ్ జరగనుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి. దాంతో ఈ మ్యాచుపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అన్ని జట్లు 15 మంది సభ్యులతో కూడిన జట్లను ప్రకటించాయి. భారత్ జట్టులో అనూహ్యంగా శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్ ఉద్వాసనకు గురవ్వగా.. సీనియర్ స్సిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అవకాశం దక్కించుకున్నాడు. ఇక భారత జట్టుకు మెంటార్గా మహేంద్రసింగ్ ధోనీని నియమించారు.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్కీపర్), ఇషాన్ కిషన్(వికెట్కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఉన్నారు. స్టాండ్ బై ప్లేయర్స్గా శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్.