ఇంగ్లండ్తో రెండో టెస్ట్లో టీమిండియా విజయం సాధించాలంటే రిస్క్ అప్రోచ్ను ఎంచుకోవాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్ సూచించాడు. రవీంద్ర జడేజా స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలన్నాడు. తొలి టెస్ట్లో భారత ఓటమికి బౌలింగ్ వైఫల్యమే కారణమని చెప్పాడు. టీమిండియా బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉందని, బౌలింగ్ విభాగంపై ఫోకస్ పెట్టాలని సూచించాడు.
ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ బుధవారం నుంచి బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మాట్లాడిన బ్రాడ్ హడిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జడేజాను పక్కనపెట్టి కుల్దీప్ యాదవ్ను ఆడించాలని చెప్పాడు.

'రవీంద్ర జడేజా పతనాన్ని చూస్తున్నామా? అంటే అవుననే అనిపిస్తోంది. అతను భారత పిచ్లపై మాత్రమే ప్రభావం చూపుతున్నాడు. అక్కడ లెఫ్టార్మ్ స్పిన్నర్ను ఆడటం కష్టం. కానీ విదేశాల్లో జడేజా బెస్ట్ స్పిన్ ఆప్షన్ కాదు. జడేజా ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. అతను మంచి ఆల్రౌండరే. కానీ అతన్ని రెండో స్పిన్నర్గా మాత్రమే ఆడించాలి. టీమిండియా బౌలింగ్ మరింత దూకుడుగా ఉండాలి. అనుభవం లేని బౌలింగ్ విభాగంతో టీమిండియా ఓటమిపాలైంది. ఇప్పటికైనా వారి ఆలోచిన విధానాన్ని మార్చుకోవాలి.
జడేజా స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ను ఆడించాలి. అతను అటాకింగ్ స్పిన్నర్గా వికెట్లు తీయగలడు.జట్టులో ఇద్దరు హోల్డ్ ఇన్ బౌలర్స్ ఉండాలి. ఆ పాత్రను సిరాజ్ పోషిస్తాడు. బౌలర్ల ఎంపిక విషయంలో టీమిండియా బోల్డ్గా నిర్ణయాలు తీసుకోవాలి. నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తే.. జట్టులో జడేజా అవసరం లేదు. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడించాలి. ముఖ్యంగా విదేశాల్లో ఇలా చేయాలి.'అని బ్రాడ్ హడిన్ సూచించాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెండో టెస్ట్ నుంచి విశ్రాంతినిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత బౌలింగ్ విభాగం ఎలా ఉండబోతుందా? అనేది చర్చనీయాంశమైంది.