
భారత్ ఎవరికీ తలవంచదు
ఓ జాతీయ మీడియాతో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'ఇప్పుడు ఆస్ట్రేలియాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. వాళ్లు తొలి టెస్టు గెలిచిన ప్రతిసారి సిరీస్ విజయం సాధించారు. ప్రత్యర్థి జట్టును చిత్తుచిత్తుగా ఓడించారు. మొదటి టెస్టులో భారత్ ఘోరపరాభవం అనంతరం.. కొంత మంది మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్లు 4-0తో కంగారూల సేన గెలుస్తుందని చెప్పారు. సిరీస్లో టీమిండియా దారుణంగా విఫలమవుతుందన్నారు. కానీ అలా జరగలేదు. ఇక్కడ ఉంది భారత్.. ఎవరికీ తలవంచదు. టీమిండియాపై ఆధిపత్యం సాధించడం అంత సులువు కాదు. ఇప్పటికైనా వారికి అర్ధమైంది అనుకుంటా' అని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ప్రశంసిచడం సంతోషం
రెండో టెస్టులో జట్టును గొప్పగా నడిపించిన తాత్కాలిక సారథి అజింక్య రహానేను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ప్రశంసిచడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ తెలిపారు. రికీ పాంటింగ్, ఆడమ్ గిల్క్రిస్ట్, మైక్ హస్సీ, షేన్ వార్న్ సహా మరికొందరు రహానే కెప్టెన్సీని కొనియాడారన్నారు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు రోజులు టీమిండియా గొప్పగానే ఆడిందని, కానీ మూడో రోజు ఆటలో ఒక గంట తడబాటుతో ఓటమిపాలైందన్నారు.
ఇక బాక్సింగ్ డే టెస్టులో బౌలర్ల సమిష్టి కృషితోనే భారత్ గొప్పగా పుంజుకుందన్నారు. కొత్త బంతితో వికెట్లు పడగొడుతూ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ భాగస్వామ్యాలు నెలకొల్పనివ్వకుండా పైచేయి సాధించారని సన్నీ చెప్పారు.

గిల్ భవిష్యత్ ఆశాకిరణం
యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ గురించి సునీల్ గవాస్కర్ మాట్లాడారు. 'గిల్ షాట్ల ఎంపిక, డిఫెన్స్ను చూస్తుంటే.. భారత్కు దీర్ఘకాలం సేవలు అందిస్తాడనిపిస్తోంది. అయితే అతడు టాప్ ఆర్డర్లో ఆడతాడా లేదా అయిదో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడా అనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే అండర్-19 స్థాయిలో గిల్ ఓపెనర్గా ఆడలేదు. మూడు/నాలుగు స్థానాల్లో క్రీజులోకి వచ్చాడు. ఏదేమైనా అతడు టీమిండియా భవిష్యత్తుకు ఆశాకిరణమవుతాడు' అని సన్నీ జోస్యం చెప్పారు. బాక్సింగ్ డే టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన గిల్ 45, 35 పరుగులతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

మహీ సరసన రహానే
తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే టెస్టుల్లో తనదైన నాయకత్వంతో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు రహానే భారత్కు మూడు మ్యాచ్ల్లో కెప్టెన్సీ వహించగా అన్నింటిలోనూ విజయాలే సాధించాడు. మెల్బోర్న్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడం ద్వారా రహానే ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. కెప్టెన్గా తొలి మూడు టెస్టుల్లో విజయం సాధించిన రెండో టీమిండియా సారథిగా రహానే నిలిచాడు. గతంలో ఎంఎస్ ధోనీ తన తొలి మూడు టెస్టుల్లో విజయాల్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మహీ సరసన రహానే చేరిపోయాడు.
ధోనీ తర్వాత ఆ రికార్డు రహానేదే.. ఆస్ట్రేలియాకు ఇదివరకే షాకిచ్చాడు!!


Click it and Unblock the Notifications
