హైదరాబాదీ యాసలో
మెల్బోర్న్లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్తో ఐదు రోజుల క్రికెట్లోనూ మహ్మద్ సిరాజ్ అరంగేట్రం చేశాడు. ఓ సాధారణ ఆటో డ్రైవర్ కొడుకు అయిన సిరాజ్.. భారత జట్టుకు ఆడటం నిజంగా ఎంతో మంది యువతలో స్ఫూర్తి నింపే అంశం. అలాంటి క్రికెటర్ తొలి టెస్ట్ ఆడిన తన అనుభవాన్ని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్తో పంచుకున్నాడు. శ్రీధర్ కూడా హైదరాబాదీ వాసే అన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ పక్కా హైదరాబాదీ యాసలో (హిందీలో మాట్లాడుకున్నా) మాట్లాడుకున్నారు. ఇప్పుడీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి సంబందించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

మన హైదరాబాద్ ఉస్తాద్
ఆర్ శ్రీధర్ మొదటగా మాట్లాడుతుండగా.. వీడియో ప్రారంభం అయింది. 'మన హైదరాబాద్ ఉస్తాద్ మహ్మద్ సిరాజ్ ఇప్పుడు నాతో ఉన్నాడు. మెల్బోర్న్లోనే ఆరంగేట్రం చేశాడు' అని శ్రీధర్ చెప్పాడు. హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగిన మన వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత నువ్ భారత్ తరఫున ఆడుతున్నావ్.. ఈ ఫీలింగ్ ఎలా ఉంది అని సిరీజ్ను శ్రీధర్ అడిగాడు. 'చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ మైదానంలో టెస్ట్ క్యాప్ అందుకోవడం మర్చిపోలేనిది' అని చెప్పాడు. ఇంకా మ్యాచుకు సంబందించిన విషయాలు ఇద్దరూ చర్చించుకున్నారు.

మరో ఆటగాడైతే
క్లబ్లు, రంజీలు, ఫ్రాంచైజీలు ఇలా ఎన్ని మ్యాచ్లు ఆడినా తెలుపు రంగు దుస్తుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం అనేది ఏ క్రీడాకారుడికైన అత్యంత ఉద్వేగభరిత క్షణం. సిరాజ్ విషయానికి వస్తే అది మరింత భావోద్వేగ పూరితం. టెస్టు సిరీస్కు ఎంపికై ఆసీస్ వెళ్లిన అనంతరం.. ఊపిరితిత్తల వ్యాధితో బాధపడుతున్న సిరాజ్ తండ్రి మహమ్మద్ గౌస్ మృతిచెందారు.
ఈ క్షణంలో మరో ఆటగాడైతే జట్టును వీడి తండ్రిని కడసారి చూసేందుకు వచ్చేవాడు కానీ ఈ స్పీడ్స్టర్ మాత్రం జాతీయ విధే ముఖ్యమని అక్కడే ఉండిపోయాడు. 'మేరా బేటా దేశ్ కా నామ్ రోషన్ కరేగా' అని తండ్రి తరచూ చెప్పే మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చిన సిరాజ్.. ఆసీస్ గడ్డపై సత్తాచాటి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలనుకుంటున్నాడు.

24 ఏళ్ల తర్వాత
వీవీఎస్ లక్ష్మణ్ (1996) తర్వాత హైదరాబాద్లో పుట్టి, టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి క్రికెటర్ మొహ్మద్ సిరాజే కావడం విశేషం. మధ్యలో మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆడినా.. అతను భువనేశ్వర్లో పుట్టాడు. సిరాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున ఒక వన్డే, మూడు టీ20లు, ఒక టెస్ట్ మ్యాచ్ (మెల్బోర్న్లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో ఆడుతున్నాడు) ఆడాడు.


Click it and Unblock the Notifications

అందులో కోహ్లీనే దాటేసిన బూమ్రా.. 3లో జడేజా, 4లో రోహిత్!!










