మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో టీమిండియాకు వరుసగా మరో పరాజయం ఎదురైంది. వైజాగ్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. గత మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా కొంపముంచితే.. తాజా మ్యాచ్లో బౌలర్లు తేలిపోయారు. 331 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడలేకపోయారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 80) ప్రతికా రావల్(96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 75) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. హర్లీన్ డియోల్(42 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 38), రిచా ఘోష్(22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 32), జెమీమా రోడ్రిగ్స్(21 బంతుల్లో 5 ఫోర్లతో 33) పర్వాలేదనిపించారు.

లోయరార్డర్ బ్యాటర్ల వైఫల్యంతో 7 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా ఆలౌటైంది. లేదంటే భారత్ 350 ప్లస్ స్కోర్ చేసేది. అమన్ జోత్ కౌర్(16), దీప్తి శర్మ(1), క్రాంతి గౌడ్(1), శ్రీచరణి(0) తీవ్రంగా నిరాశపర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అన్నబెల్ సదర్లాండ్(5/40) ఐదు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించింది. సోఫీ మోలినక్స్(3/75) మూడు వికెట్లు తీయగా.. మేఘన స్కట్, అష్లే గార్డ్నర్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ అలీసా హీలీ(107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్లతో 142) భారీ శతకంతో చెలరేగగా.. ఫోబీ లిచిఫీల్డ్(40), ఎల్లీస్ పెర్రీ(47 నాటౌట్), అష్లే గార్డ్నర్(46 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 45) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
భారత బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి(3/41) మూడు వికెట్లతో సత్తా చాటగా.. అమన్జోత్ కౌర్(2/75), దీప్తి శర్మ(2/52) రెండేసి వికెట్లు పడగొట్టారు. క్రాంతి గౌడ్(0/73), స్నేహ్ రాణా(0/85) ధారళంగా పరుగులిచ్చుకున్నారు. ఈ ఇద్దరి వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై భారత బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేయలేకపోయారు. పరుగులను కట్టడి చేయలేక ఓటమికి తలవంచారు.
ఈ ఓటమితో టీమిండియా తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. చివరి మూడు మ్యాచ్లకు మూడు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 విజయాలు 2 ఓటములతో పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో కొనసాగుతున్న భారత్.. తదుపరి మ్యాచ్ల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్లకు మూడు గెలిస్తేనే.. ఏ జట్టుతో సంబంధం లేకుండా సెమీస్కు అర్హత సాధిస్తోంది.