
సచిన్దే టాప్..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నిలిచాడు. ఈ ట్రోఫీలో మొత్తం 34 మ్యాచ్ల్లో 65 ఇన్నింగ్స్లు ఆడిన సచిన్.. 56.24 సగటుతో 3262 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలున్నాయి. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి 9 ఏళ్లు అవుతున్నా ఈ రికార్డు చెక్కు చెదరలేదు. ఆ తర్వాత రికీ పాంటింగ్(2555), వీవీఎస్ లక్ష్మణ్(2434), రాహుల్ ద్రవిడ్(2143), మైకేల్ క్లార్క్(2049) ఉన్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో చతేశ్వర్ పుజారా అగ్రస్థానంలో ఉండగా.. స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో ఉన్నారు.

ఏడు సెంచరీలు బాదిన కోహ్లీ..
2010-21 వరకు 20 మ్యాచ్ల్లో 37 ఇన్నింగ్స్లు ఆడిన చతేశ్వర్ పుజారా 54.08 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలతో పాటు 10 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 204. ఇక 2013-2021 వరకు 14 మ్యాచ్ల్లో 28 ఇన్నింగ్స్లు ఆడిన స్మిత్..72.58 సగటుతో 1742 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలుండగా.. 192 అత్యధిక స్కోర్. విరాట్ కోహ్లీ.. 20 మ్యాచ్ల్లో 36 ఇన్నింగ్స్ల్లో 48.05 సగటుతో 1682 రన్స్ చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలుండగా.. అత్యధిక స్కోర్ 169.

ఆసీస్కు దబిడి దిబిడే..
ఆసీస్పై ఇప్పటికే ఏడు సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ.. తాజా సిరీస్లో చుక్కలు చూపిస్తాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా అంటే విరాట్ కోహ్లీకి పూనకాలే వస్తాయని, బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. అభిమానులే కాదు సంజయ్ బంగర్, ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు సైతం ఆసీస్పై కోహ్లీ చెలరేగుతాడని అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియాతో పోటీని కోహ్లీ తెగ ఇష్టపడుతాడని బంగర్ తెలిపాడు.

పాత కోహ్లీని చూడోచ్చు..
'ఆస్ట్రేలియాతో పోటీని కోహ్లీ తెగ ఇష్టపడుతాడు. టెస్ట్ ఫార్మాట్తో విరాట్ కోహ్లీ అసలు సిసలు సత్తా బయటపడుతోంది. గత రెండున్నరేళ్లుగా అతను ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం తన బ్యాటింగ్ అప్రోచ్ చాలా ప్రెష్గా ఉంది. టీ20, వన్డేల్లో తన బ్యాటింగ్ను ఆస్వాదించాడు. టెస్ట్ క్రికెట్లోనూ అదే ఫామ్ను కొనసాగించగలడు. తన బ్యాటింగ్తో ఈ సిరీస్పై ప్రభావం చూపగలడు'అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












