
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డుకు 64 పరుగుల దూరంలో ఉన్నాడు. అప్కమింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ మరో 64 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 25 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించనున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఇప్పటి వరకు 546 ఇన్నింగ్స్ల్లో 24,936 పరుగులు చేశాడు.
ఇక, అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ కంటే ముందు 25000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (782 ఇన్నింగ్స్ల్లో 34357 పరుగులు) మొదటి స్థానంలో ఉండగా.. కుమార సంగక్కర (666 ఇన్నింగ్స్ల్లో 28016 పరుగులు), రికీ పాంటింగ్ (688 ఇన్నింగ్స్ల్లో 27483 పరుగులు), మహేళ జయవర్ధనే (725 ఇన్నింగ్స్ల్లో 25957 పరుగులు), జాక్వస్ కల్లీస్ (617 ఇన్నింగ్స్ల్లో 25534) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇక భారత్ తరఫున 25వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కోహ్లీ చరిత్రకెక్కనున్నాడు. ఈ తరం క్రికెటర్లలో ఎవరూ కూడా ఈ రికార్డుకు దరిదాపుల్లో కూడా లేరు. నాగ్పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి జరిగే తొలి టెస్ట్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తెరలేవనుంది. ఈ సిరీస్ విజయం కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి.
ఇరు జట్ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. భారత్-ఆసీస్లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్ట్ మ్యాచ్ల్లో పోటీ పడగా 30 మ్యాచ్ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక సిరీస్ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్లు జరగ్గా ఆసీస్ 12, భారత్ 10 సిరీస్లు గెలిచాయి. 5 సిరీస్లు డ్రా అయ్యాయి.