
నాగ్పూర్: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో అతను సాధించిన ఘనతలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్ చేయడం విరాట్ కోహ్లీకి చాలా ఇష్టం. ఒత్తిడిని ఆస్వాదిస్తూ ప్రత్యర్థి బౌలర్ల మైండ్సెట్తో ఆడుకుంటాడు. ఆస్ట్రేలియా వేదికగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై కింగ్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే అతను ఎంత స్పెషల్ బ్యాటరో అర్థమవుతోంది. ఓటమి అంచున చేరిన జట్టును విరాట్ ఒంటి చేత్తో గెలిపించాడు.
ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడం కోహ్లీ నైజం. గత రెండేళ్లు కాస్త ఇబ్బంది పడినా.. ఆసియాకప్తో మళ్లీ లయ అందుకున్న కింగ్ కోహ్లీ.. సెంచరీల మోతతో మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంతటి బౌలర్నైనా ఎదుర్కొనే సత్తా ఉన్న కోహ్లీ.. స్పిన్కు మాత్రం కాస్త తడబడుతాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఆడటంలో విరాట్ విఫలమవుతున్నాడు. ఇటీవల కాలంలో ఈ సమస్య మరీ ఎక్కువైంది. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ల్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో కోహ్లీ మిచెల్ సాంట్నర్ బౌలింగ్లోనే ఔటయ్యాడు.
దాంతో ఈ బలహీనతపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కోహ్లీ.. నెట్స్లో గంటలకొద్దీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముఖ్యంగా రివర్స్ స్వీప్, స్వీప్ షాట్లు ఆడటం నేర్చుకుంటున్నాడు. సోమవారం జరిగిన సెషన్స్లో విరాట్ పూర్తిగా లెఫ్టార్మ్ స్పిన్నర్లనే ఎదుర్కొన్నాడు. నెట్ బౌలర్ సౌరభ్ కుమార్ బౌలింగ్ను ఎక్కువ సేపు ఆడాడు. ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విరాట్ నెట్స్లో చెమటోడుస్తున్నాడు. ఈ సిరీస్లో టర్నింగ్ ట్రాక్సే ఉంటాయని ఊహించిన ఇరు జట్ల బ్యాటర్లు ప్రత్యేకంగా సన్నదమవుతున్నారు.
రోహిత్ శర్మ సైతం స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లను ప్రాక్టీస్ చేశాడు. ఈ సిరీస్లో టర్నింగ్ ట్రాక్స్ సిద్దం చేస్తున్న నేపథ్యంలో స్పిన్నర్లు ఈ సిరీస్ ఫలితాన్ని శాసించనున్నారు. ఈ క్రమంలోనే ఇరు జట్ల ఆటగాళ్లు స్పిన్ ఎదుర్కోవడంపై ఫోకస్ పెట్టాయి.