భారత్లో రాజకీయ జోక్యం లేని రంగం లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేశంలోని ప్రతీ వ్యవస్థపై రాజకీయ నాయకుల ప్రభావం ఉంది. క్రీడా రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటలకు ఏ మాత్రం సంబంధంలేని రాజకీయ నాయకులు ఆయా ఫెడరేషన్ల అధ్యక్షులుగా కొనసాగుతూ ఉంటారు.
వాస్తవానికి ఏ క్రీడల్లోనైనా రాజకీయ జోక్యం ఉండరాదు. భారత్లో మాత్రం ప్రతీ క్రీడా ఫెడరేషన్ను రాజకీయ నాయకులే నడిపిస్తూ ఉంటారు. ఈ దేశం ఓ మతంలా భావించే క్రికెట్లోనూ అదే పరిస్థితి. అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కీలక పదవులు చేపడుతారు. వారికి నచ్చిన ఆటగాళ్లే కెప్టెన్లుగా.. కోచ్లుగా.. సెలెక్టర్లుగా కొనసాగుతారనే ఆరోపణలు తరుచుగా వస్తూనే ఉంటాయి.

జై షాదే ఆధిపత్యం..
క్రికెట్కు ఏ మాత్రం సంబంధం లేని జై షా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని పాలిస్తున్నాడు. పేరుకు సెక్రటరీనే అయినా.. పూర్తి ఆధిపత్యం ఆయనదే. గతంలో బీసీసీఐ అధ్యక్షుడే భారత క్రికెట్ను నడిపించేవారు. కానీ జై షా ఎంట్రీతో బీసీసీఐలోని పాలనా వ్యవహారం పూర్తిగా మారిపోయింది.
బీసీసీఐ ప్రెసిడెంట్గా సౌరవ్ గంగూలీ ఉన్నన్ని రోజులు కొంత ఆయన కంట్రోల్ ఉంది. కానీ తనకు అడ్డుగా ఉన్న గంగూలీని తప్పించిన జై షా బీసీసీఐ సెక్రటరీగా భారత క్రికెట్ను పాలిస్తున్నాడు. తన తండ్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అండదండలతో పవర్ఫుల్ మ్యాన్గా బోర్డును నడిపిస్తున్నాడు.
గంభీర్ నియామకం వెనుక రాజకీయం
టీమిండియా తదుపరి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను నియమించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ఈ టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుండటంతో బీసీసీఐ కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. దరఖాస్తుల గడువు ముగిసినా.. కొత్త కోచ్ ఎంపికకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
కానీ తమకు అనుకూలమైన జర్నలిస్ట్లతో వరుసగా లీక్స్ ఇస్తోంది. తాజాగా టీమిండియా హెడ్ కోచ్ పదవికి గంభీర్ ఒక్కరే దరఖాస్తు చేసుకున్నాడనే వార్త అందర్నీ విస్మయపరుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం ఒక్కరే దరఖాస్తు చేసుకోవడం ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి. బీసీసీఐ అధికారికంగా వెల్లడించినా.. బోర్డు నుంచి వచ్చిన లీక్గా అర్థమవుతోంది.
బీజేపీ టికెట్ వదులుకున్నందుకు
గత నెల రోజులుగా తమకు అనుకూలమైన మీడియాలో టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీరే సరైనోడనే అభిప్రాయం కలిగేలా ప్రచారం చేస్తున్నట్లు అనిపిస్తోంది. గంభీర్ బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ. ఈస్ట్ ఢిల్లీ నుంచి ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందాడు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు గంభీర్.. కేకేఆర్ మెంటార్గా బాధ్యతలు చేపట్టాడు.
కేకేఆర్ కోసం పోటీ నుంచి తప్పుకుంటున్నానని గంభీర్ ప్రకటించాడు. అయితే గంభీర్ను బీజేపీ అధిష్టానమే తప్పించిందనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. హర్షా మల్హోత్రా కోసం గంభీర్ను బీజేపీ అధిష్టానం తప్పించింది. ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించిన బీజేపీ అధిష్టానం కేంద్ర సహాయమంత్రి పదవి కూడా ఇచ్చింది.
ఢిల్లీలో అధికారం చేపట్టడే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ వదులుకున్నందుకు గంభీర్కు టీమిండియా హెడ్ కోచ్ పదవి ఆఫర్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఆఫర్లో భాగంగానే అతన్ని నేరుగా టీమిండియా హెడ్ కోచ్గా నియమిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా గంభీర్ అమిత్ షాను కలవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది.