భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లోకి మరో బీజేపీ నేత వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. దాంతో ఆయన స్థానాన్ని బీజేపీ దివంగత నేత అరుణ్ జైట్లీ తనయుడు రోహన్ జైట్లీ భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రొఫెషనల్ లాయర్ అయిన రోహన్ జైట్లీ ప్రస్తుతం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఐసీసీ ఛైర్మన్ పదవి రేసులో జై షా ఉన్నట్లు ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ బీసీసీఐ కార్యదర్శిగా జై షాకు మరో ఏడాది పదవీ కాలం మాత్రమే ఉంది. ఆ తర్వాత బీసీసీఐ రూల్స్ ప్రకారం ఆయన మూడేళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలి.

బీసీసీఐలో ఎలాంటి పదవుల్లో కొనసాగకూడదు. ఈ క్రమంలోనే ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టాలని జై షా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఛైర్మన్ పదవికి ఎన్నికయ్యే మద్దతు కూడా జై షాకు ఉన్నట్లు సమాచారం. ఐసీసీ ఛైర్మన్గా జై షా ఎన్నికైతే.. ఈ పదవి చేపట్టిన అతి పిన్నవయస్కుడిగా ఆయన రికార్డుకెక్కనున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడైన జైషా.. బీసీసీఐని అంతా తానై నడిపిస్తున్న విషయం తెలిసిందే. బీసీసీఐ షాడో ప్రెసిడెంట్గా.. బాస్గా చలామణి అవుతున్నారు. ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగుస్తుంది. మరోసారి ఎన్నికల బరిలో నిలవకూడదని అతను నిర్ణయించుకోవడంతో జై షా పోటీ పడుతారనే చర్చ జోరుగా సాగుతుంది. అయితే ఈ వ్యవహారంపై ఆగస్ట్ 27న స్పష్టత రానుంది. ఐసీసీ ఛైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్లు వేసేందుకు అది ఆఖరి రోజు.
రూల్స్ ప్రకారం పర్యాయానికి రెండేళ్ల చొప్పున ఎవరైనా ఐసీసీ ఛైర్మన్గా మూడు పర్యాయాలు ఉండొచ్చు. న్యూజిలాండ్కు చెందిన బార్క్లే ఇప్పటికే నాలుగేళ్లు పూర్తి చేశాడు. మూడో సారి ఛైర్మన్ పదవికి పోటీ చేయనని బార్క్లే చెప్పాడని ఐసీసీ ప్రకటించింది. నవంబరులో తన పదవీకాలం ముగిసిన తర్వాత తప్పుకుంటాడని పేర్కొంది.
బార్క్లే 2020 నవంబర్లో ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించగా.. 2022లో తిరిగి ఎన్నికయ్యాడు. ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో మొత్తం 16 ఓట్లు ఉండగా.. 9 ఓట్లు లభించిన వ్యక్తి గెలుస్తాడు. జై షా ప్రస్తుతం ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల ఉప సంఘం అధిపతిగా ఉన్నారు. ఓటు హక్కు ఉన్న చాలా దేశాలు జై షా పట్ల సానుకూలతతో ఉన్నాయి.
అంతేకాకుండా ఐసీసీ ఛైర్మన్గా ఎంపికైన ఐదో భారతీయుడిగా నిలవనున్నారు. జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్లు భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికయ్యారు.