టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు కలిసి ఆడిన ఈ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఎంతలా అంటే కోహ్లీ మరో తల్లికి పుట్టిన సోదరుడని డివిలియర్స్ చెప్పేటంతా.. ఇరు కుటుంబాలు కలిసి వెకేషన్ వెళ్లెటంతా..!
ఈ ఇద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో ఈ ఇద్దరూ ప్రాణ స్నేహితులని, ఒకరికొకరు గౌరవించుకుంటారనే విషయం స్పష్టమైంది. తాజాగా ఏబీ డివిలియర్స్కు ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. డివిలియర్స్తో పాటు ఇంగ్లండ్ దిగ్గజం అలిస్టర్ కుక్, భారత మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్కు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా డివిలియర్స్ను అభినందిస్తూ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ను షేర్ చేశాడు. ఏబీని కోహ్లీ ముద్దుగా పిలుచుకునే బిస్కోటీ అనే పేరును ఉపయోగిస్తూ అభినందనలు తెలిపాడు. 'కంగ్రాట్స్ బిస్కోటీ.. నేను కలిసి ఆడిన క్రికెటర్లలో నువ్వు అత్యంత ప్రతిభావంతమైన ఆటగాడివి. నంబర్ వన్ ప్లేయర్వి. గొప్ప క్రికెటర్లలో ఒకడివి 'అని విరాట్ కోహ్లీ రాసుకొచ్చాడు.
డివిలియర్స్ను అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్గా అభివర్ణించాడు. అతడు తన స్కిల్స్పై మాత్రమే కాకుండా, సొంత బలాన్ని కూడా నమ్ముతాడని చెప్పాడు. డివిలియర్స్తో కలిసి ఆడిన ఇన్నింగ్స్ల్లో తనకు ఇష్టమైన ఒక సందర్భాన్ని విరాట్ ఈ పోస్ట్లో ప్రస్తావించాడు. 2016లో కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో సునీల్ నరైన్ బౌలింగ్లో డివిలియర్స్ బాదిన 94 మీటర్ల సిక్స్ను గుర్తు చేసుకున్నాడు.
నాన్స్ట్రైకర్స్ ఎండ్లో ఉన్న తాను, డివిలియర్స్ సింగిల్ తీస్తాడని భావించానని, కానీ, డివిలియర్స్ భారీ షాట్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడని చెప్పుకొచ్చాడు. మైదానంలో ఇలాంటి ఊహించని, అపురూపమైన విన్యాసాలు చేయగలగడం డివిలియర్స్కి మాత్రమే సాధ్యమని కొనియాడాడు.
ఎవ్వరికీ సాధ్యం కాని విభిన్నమైన, భారీ షాట్లు ఆడటం మాత్రమే కాదని, ఆపదలో జట్టును ఆదుకోవడం కూడా డివిలియర్స్ ప్రత్యేకత అని విరాట్ కోహ్లీ గుర్తు చేశాడు. డివిలియర్స్ మ్యాచ్పైనే కాకుండా, ప్రేక్షకుల మనసులపై కూడా ప్రభావం చూపగలడని తెలిపాడు. ఈ విధానమే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టిందని చెప్పుకొచ్చాడు.
14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఏబీ డివిలియర్స్ సౌతాఫ్రికా తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 20,000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న డివిలియర్స్.. 2021లో ఐపీఎల్కు వీడ్కోలు పలికాడు.