హైదరాబాద్: హెచ్సీఏ( హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్)ను గాడిలో పెట్టేందుకు సుప్రీం కోర్టు నియమించిన సింగిల్ జడ్జి, రిటైర్డ్ జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు.. అసోసియేషన్ భారీ ప్రక్షాళనకు నడుం బిగించారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న 57 క్రికెట్ క్లబ్లపై కఠిన చర్యలు తీసుకున్నారు.
హెచ్సీఏ తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా వాటిపై నిషేధం విధించారు. ఆఫీస్ బేరర్ల ఎన్నిక, గుర్తింపు, యాజమాన్య బదిలీ, మల్టీపుల్ ఓనర్షిప్, పరస్పర విరుద్ధ ప్రయోజనాలు తదితర ఫిర్యాదులపై సదరు క్లబ్ల ప్రతినిధుల నుంచి వివరణ కోరిన రిటైర్డ్ జస్టిస్.. అనంతరం చర్యలు తీసుకుంటూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఆదేశాల ప్రకారం 57 క్లబ్లకు చెందిన ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ హెచ్సీఏలో ఎలాంటి పదవీ బాధ్యతలు నిర్వర్తించడానికి వీలు లేదు. ఈ నిషేధం ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ టర్మ్ ముగిసేవరకు లేదంటే మూడేళ్ల పాటు కొనసాగుతోంది. ఎన్నికల్లో ఆయా క్లబ్లకు ఓటు హక్కు కూడా ఉండబోదు. అయితే ఈ క్లబ్లకు చెందిన జట్లు హెచ్సీఏ లీగ్లు, టోర్నీల్లో ఆడేందుకు అనుమతించారు.
57 క్లబ్స్పై నిషేధం విధించడంతో మాజీ క్రికెటర్ల అర్షద్ అయూబ్, వంకా ప్రతాప్, మాజీ కార్యదర్శి ఆర్. విజయానంద్, మాజీ ఉపాధ్యక్షుడు కె. జాన్ మనోజ్, 1983 ప్రపంచ కప్ జట్టు మేనేజర్ పిఆర్ మాన్ సింగ్, టి. శేష్ నారాయణ్, పి. యాదగిరి, సుదర్శన్ రాజులను ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయారు.
ఆ క్లబ్ల సభ్యులు కాకపోవడంతో జి. వివేక్, ఎన్ శివలాల్ యాదవ్ ఈ వేటు నుంచి తప్పించుకున్నారు. రిటైర్డ్ జస్టిస్ నాగేశ్వర్ రావు తీసుకున్న ఈ నిర్ణయంపై అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. అసోసియేషన్ ప్రక్షాళనకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని, బోగస్ ఓట్లను తీసేసినట్లు అయ్యిందని ట్వీట్ చేశారు.
అతి త్వరలోనే హెచ్సీఏ ఎన్నికల అధికారిని నియమించి.. నోటిఫికేషన్ విడుదల చేస్తామని జస్టిస్ నాగేశ్వర్ రావు తెలిపారు.