
న్యూఢిల్లీ: టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాలతోనే ఆసియాకప్ 2022 టోర్నీకి దూరం కాగా.. తాజాగా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఆ జాబితాలో చేరాడు. మోకాలి గాయంతో ఆసియా కప్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన జడేజా.. గాయం తీవ్రత కారణంగా వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి.
మోకాలి శస్త్ర చికిత్స నేపథ్యంలో జడేజా మెగా టోర్నీ మొత్తానికే దూరం కానున్నాడని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ శనివారం వెల్లడించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు జడేజాకు మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని డాక్లర్లు తెలిపినట్లు పేర్కొంది. దీంతో జడేజా మరో ఆరు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉంటాడని తెలుస్తోంది.
'జడేజా కుడి మోకాలికి అయిన గాయం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అతనికి మోకాలి శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సర్జరీ నుంచి కోలుకునేందుకు జడేజా చాలా సమయం పట్టనుంది. ప్రస్తుతానికి అయితే కొన్నాళ్లు అతన్ని ఎన్సీఏ మెడికల్ టీమ్ పర్యవేక్షించనుంది. సర్జరీ చేస్తే మాత్రం అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి చాలా సమయం పట్టనుంది'అని పీటీఐ పేర్కొంది.
ఆసియాకప్ 2022లో రెండు మ్యాచ్లు ఆడిన జడేజా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. పాక్తో జరిగిన మ్యాచ్లో 2 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చిన జడ్డూ.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చి 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేసి విజయానికి బాటలు వేసాడు. జడేజాను నాలుగో స్థానంలో పంపుతూ టీమ్మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం ఫలించింది.
ఆ తర్వాత హంగ్ కాంగ్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చిన జడేజా ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఈ మ్యాచ్లో జడ్డూకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్ అనంతరం మోకాలి గాయం తిరగబెట్టడంతో జడ్డూ టోర్నీ నుంచి మధ్యలోనే నిష్క్రమించాడు. జడేజా ఇటీవలి కాలంలో వరుసగా గాయాల బారిన పడుతూ జట్టులోకి వచ్చి పోతున్న విషయం తెలిసిందే. జడేజా పదే పదే గాయపడుతున్న నేపథ్యంలో ఎన్సీఏ పనితీరుపై విమర్శలు వస్తున్నాయి.