కోల్కతా: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో మరో ప్లేయర్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన రీస్ టోప్లీ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు అతను స్వదేశం పయనమయ్యాడు.
ఇప్పటికే విల్ జాక్స్, రజత్ పటీదార్ గాయాలతో ఈ సీజన్ మొత్తానికి దూరం కాగా.. ఈ జాబితాలో రీస్ టోప్లీ చేరాడు. సీజన్ ప్రారంభానికి ముందే విల్ జాక్స్ దూరం కాగా.. మైఖేల్ బ్రేస్వెల్తో ఆర్సీబీ అతని స్థానాన్ని భర్తీ చేసింది. రజత్ పటీదార్ రిప్లేస్మెంట్ను ఇంకా ప్రకటించలేదు. ఇంతలోనే రీస్ టోప్లీ సేవల కూడా కోల్పోవడంతో ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ పడింది. బౌండరీని ఆపే క్రమంలోనే రీస్ టోప్లీ భుజం డిస్ లోకేట్ అయ్యింది.

అయితే అతను కొన్ని మ్యాచ్లకు మాత్రమే దూరమవుతాడని భావించిన ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది. ఆడిన ఒక్క మ్యాచ్లో టోప్లీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. రెండు ఓవర్లు మాత్రమే వేసి రెండు వికెట్లు తీసాడు. కేకేఆర్తో మ్యాచ్ కోసం కోల్కతా కూడా వచ్చిన టోప్లీ అంతలోనే సీజన్ మొత్తానికి దూరమైన వార్త ఆర్సీబీ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.
టోప్లీ స్థానంలో జట్టులోకి వచ్చిన డేవిడ్ విల్లే అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కేకేఆర్తో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసాడు. జోష్ హజెల్ వుడ్ వచ్చే వరకు అతనే జట్టులో కొనసాగనుండగా.. టోప్లీ స్థానంలో ఎవర్నీ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి కాస్త సమతూకంగా కనిపించిన ఆర్సీబీకి గాయాలు వేధిస్తున్నాయి.