ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ విషయంలో మొండి పట్టుతో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు బిగ్ షాక్ తగలనుంది. ఈ టోర్నీని సౌతాఫ్రికాకు తరలించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ జట్టుకే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ వేదికగా ఈ టోర్నీ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ను పీసీబీ.. ఐసీసీకి పంపించింది. మరోవైపు స్టేడియాల పునరుద్దరణ కార్యక్రమం కూడా చేపట్టింది.

అయితే ఈ టోర్నీ కోసం పాకిస్థాన్లో పర్యటించలేమని, తమ మ్యాచ్లను తటస్థ వేదికగా నిర్వహించాలని ఐసీసీని భారత్ కోరింది. తమ ఆటగాళ్ల భద్రతా కారణాల నేపథ్యంలో పాక్లో పర్యటించలేమని, హైబ్రిడ్ మోడల్లో టోర్నీ ని నిర్వహించాలని బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. మరోవైపు టీమిండియా పాకిస్థాన్లో పర్యటించేందుకు భారత ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడం లేదు.
పాకిస్థాన్ మాత్రం హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీని నిర్వహించేందుకు అంగీకరించడం లేదు. అవసరమైతే టోర్నీ నుంచి తప్పుకుంటాం తప్పా.. హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించలేమని స్పష్టం చేస్తోంది. భారత్ రాకుంటే ఆ జట్టు స్థానంలో మరో టీమ్కు అవకాశం ఇవ్వాలని కూడా పీసీబీ.. ఐసీసీని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ ఐసీసీ భారత్కు అనుకూలంగా వ్యవహరిస్తే.. టోర్నీ నుంచి తప్పుకొని న్యాయ పోరాటం చేస్తామని కూడా పీసీబీ హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఇరు దేశాలు మొండిగా వ్యవహరిస్తుండటంతో ఐసీసీ ఎటు తేల్చుకోలేకపోతుంది. టోర్నీని రద్దు చేయడం లేదా వాయిదా వేయాలనే ఆలోచనలో ఐసీసీ ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాకిస్థాన్ అంగీకరించకపోతే.. సౌతాఫ్రికా వేదికగా ఈ టోర్నీని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
భారత్ను కాదని ఈ టోర్నీని నిర్వహించలేమని, ఆర్థికపరమైన సమస్యలు వస్తాయని ఐసీసీ వాదిస్తోంది. మరోవైపు క్రికెట్ బోర్డుల్లో అత్యంత సంపన్నమైన బోర్డు బీసీసీఐ. మరే క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐకి వ్యతిరేకంగా నడుచుకోలేదు. అంతేకాకుండా వచ్చే నెల మొదటి వారంలోనే ఐసీసీ ఛైర్మన్గా బీసీసీఐ సెక్రటరీ జై షా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాబట్టి భారత్కు వ్యతిరేకంగా ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోదు. పాకిస్థాన్ జట్టే వెనక్కి తగ్గి హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించాల్సి ఉంటుంది. లేకుంటే ఆ జట్టే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.
🚨 SOUTH AFRICA LIKELY TO HOST 2025 CHAMPIONS TROPHY IF PAKISTAN REFUSES FOR HYBRID MODEL...!!! 🚨 (Sports Tak). pic.twitter.com/g9xhXrN5LI
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 12, 2024