టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు జట్టుకు దూరమయ్యాడు. సౌతాఫ్రికా పర్యటనలో తీవ్రంగా గాయపడిన సూర్యకుమార్ యాదవ్కు ఏడు వారాలా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్లో సూర్య ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు.
బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో అతని కాలు మెలిక పడింది. దాంతో అతని ఎడమ చీలమండకు తీవ్ర గాయమైంది. ఆ గాయంతో తీవ్ర నొప్పితో విలవిలలాడిన సూర్య కనీసం కాలుని నేలపై పెట్టలేకపోయాడు. ఫిజియోల సాయంతో బయటకు వెళ్లిన అతను.. మ్యాచ్ ముగిసిన తర్వాత సాధారణంగానే కనిపించాడు. దాంతో పెద్ద గాయం ఏం కాదని అంతా భావించారు.

కానీ స్కానింగ్లో అతని చీలమండలో గ్రేడ్ 1 చీలిక వచ్చినట్లు వైద్యులు తెలిపారు. పూర్తిగా కోలుకోవడానికి కనీసం 7 వారాలు సమయం పడుతుందని చెప్పాడు. దీంతో సూర్య జనవరి 11 నుంచి సొంతగడ్డపై అఫ్గానిస్థాన్తో జరిగే మూడు టీ20ల సిరీస్కు దూరం కానున్నాడు. అలాగే ఇంగ్లండ్తో జరిగే సిరీస్లు ఆడటం కూడా సందేహంగా మారింది.
టీ20 కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా సైతం చీలమండ గాయంతోనే జట్టుకు దూరమయ్యాడు. ప్రపంచకప్ సందర్భంగా గాయపడ్డ అతను ఇంకా కోలుకోలేదు. దాంతో సూర్య టీ20ల్లో తాత్కలిక సారథిగా వ్యవహరించాడు. ఇప్పుడు అతను కూడా గాయపడటంతో అఫ్గానిస్థాన్ సిరీస్కు కొత్త కెప్టెన్ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సూపర్ ఫామ్లో ఉన్న సూర్య.. గాయంతో దూరమవడం ఆందోళనకు గురి చేస్తోంది. జూన్లోనే టీ20 ప్రపంచకప్ జరగనునున్న నేపథ్యంలో అతను పూర్తిగా కోలుకొని మునపటిలా రాణిస్తాడా? లేదా? అనే సందేహం నెలకొంది. వినూత్న షాట్లతో బ్యాటింగ్ చేసే సూర్య.. టీ20ల్లో టీమిండియాకు కీలకం కానున్నాడు. ప్రస్తుతం అతను నెంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు.