భారత్తో జరుగుతున్న ఆఖరి టెస్ట్లో ఇంగ్లండ్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ క్రిస్ వోక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం ఓవల్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో డైవ్ చేసిన క్రిస్ వోక్స్.. భుజ గాయంతో విలవిలలాడాడు. ఫిజియోల సాయంతో మైదానం వీడాడు. ఆఖరి సెషన్ ఆటలో జెమీ ఓవర్టన్ వేసిన 57వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ ఐదో బంతిని కరుణ్ నాయర్.. మిడాఫ్ దిశగా ఆడగా.. అటు వైపే ఫీల్డింగ్ చేసిన క్రీస్ వోక్స్ పరుగెత్తి బంతిని బౌండరీ వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో సమన్వయం కోల్పోయిన అతను కిందపడిపోయాడు. అతని ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. దాంతో క్రిస్ వోక్స్కు తీవ్రగాయమైంది. నొప్పితో అతను మైదానం వీడాడు. గాయం తీవ్రత చూస్తుంటే.. అతని ఎడమ భుజం డిస్ లోకేట్ అయినట్లు అనిపిస్తోంది. క్రిస్ వోక్స్ను హుటాహుటిన స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు.

ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ ఒక్కడే ఐదు మ్యాచ్లు ఐదు ఆడాడు. ఈ మ్యాచ్లోనూ అతను కేఎల్ రాహుల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రిస్ వోక్స్ మళ్లీ మైదానంలోకి దిగకుంటే మాత్రం ఇంగ్లండ్కు ఎదురుదెబ్బే. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న ఈ వికెట్పై క్రిస్ వోక్స్ బరిలోకి దిగడం ఇంగ్లండ్కు అత్యంత కీలకం.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(2), కేఎల్ రాహుల్(14) పెవిలియన్ చేరారు. అట్కిన్సన్ బౌలింగ్లో జైస్వాల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగ్గా.. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడారు. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపేసిన అంపైర్లు.. నిర్ణీత సమయం కన్నా ముందే లంచ్ బ్రేక్ ప్రకటించారు. దాంతో భారత్ 23 ఓవర్లలో 72/2 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
గంట విరామం అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగా.. ఆదిలోనే శుభ్మన్ గిల్ లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఆ వెంటనే మరోసారి వర్షం రావడంతో టీమిండియా 85/3 స్కోర్తో మైదానం వీడింది. వర్షం భారీగా పడటం, ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో దాదాపు రెండు గంటల పాటు ఆటకు అంతరాయం కలిగింది. అనంతరం రెండో సెషన్ను ముగించిన అంపైర్లు ఆఖరి సెషన్ను మొదలుపెట్టారు.
సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ నిలకడగా రాణించే ప్రయత్నం చేశారు. కానీ సాయి సుదర్శన్(38)ను జోష్ టంగ్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే రవీంద్ర జడేజా(9) టంగ్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. ధ్రువ్ జురెల్ సైతం(19) నిరాశపర్చాడు. క్రీజులోకి వచ్చిన సుందర్, కరుణ్ నాయర్ పోరాడుతున్నారు. ఆఖరి అవకాశాన్ని కరుణ్ నాయర్ ఎట్టకేలకు సద్వినియోగం చేసుకున్నాడు. ఆచితూచి ఆడి 89 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.