
సిడ్నీ: ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన డిఫెండింగ్ చాంపియన్ సిడ్నీ సిక్సర్స్.. బిగ్బాష్ లీగ్(బీబీఎల్) టైటిల్ను మూడోసారి చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్ జట్టు 27 పరుగుల తేడాతో పెర్త్ స్కార్చర్స్ జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్, ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మెన్ జేమ్స్ విన్స్ (60 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 95) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు పరుగుల తేడాలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. జే రిచర్డ్ సన్, ఆండ్రూ టై, చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఓపెనర్లు బాన్క్రాఫ్ట్ ( 30), లివింగ్స్టోన్ (45) శుభారంభం అందించినా... ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ తడబడటంతో పెర్త్ విజయానికి దూరమైంది. సిడ్నీ బౌలర్లలో బెన్ డ్వార్షుస్ మూడు వికెట్లు తీయగా... జాక్సన్ బర్డ్, సీన్ అబాట్, క్రిస్టియన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జేమ్స్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. జోష్ ఫిలిప్పికీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డులు దక్కాయి. విజేత జట్టుకు రూ.2.45 కోట్ల ప్రైజ్మనీ దక్కనుంది.