ఐపీఎల్ 2025 మెగా వేలానికి రంగం సిద్దమైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆది, సోమ(నవంబర్ 24, 25)వారాల్లో మెగా వేలం జరగనుంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా.. పది ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి.
వేలంలో కొనుగోలు చేసే ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాయి. కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు కావాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. మరోవైపు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. మాక్ ఆక్షన్ నిర్వహించి మెగా వేలంపై ఆసక్తిని మరింత రెట్టింపు చేశాడు.

తమిళనాడుకు చెందిన మాజీ క్రికెటర్లు, అభిమానుల సాయంతో అశ్విన్.. ఆక్షనీర్గా అవతారమెత్తి మాక్ ఆక్షన్ నిర్వహించాడు. ఈ ఉత్తుత్తి మెగా వేలంలో ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించాయి.
ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్ల కోసం జరిగిన వేలం సెట్లో సాయి కిషోర్ను రూ. 10 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. నూర్ అహ్మద్ను పంజాబ్ జట్టు రూ. 6.5 కోట్లకు తీసుకుంది. పంజాబ్ మాజీ ప్లేయర్ రాహుల్ చాహర్ను సీఎస్కే తీసుకుంది. మూడో స్పిన్నర్గా అతన్ని కొనుగోలు చేసింది.
తమిళనాడుకు చెందిన నటరాజన్ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 10 కోట్లకు కొనుగోలు చేయగా.. నవీన్ ఉల్ హక్ను రూ. 5.5కోట్లకు తీసుకుంది. భారత పేసర్ ప్రసిధ్ కృష్ణను రాజస్థాన్ రాయల్స్ రూ. 3.75 కోట్లకు కొనుగోలు చేయగా.. ముఖేష్ కుమార్ను రూ. 5.5 కోట్లకు ఆర్సీబీ తీసుకుంది.
భువనేశ్వర్ కుమార్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 7 కోట్లకు కొనుగోలు చేయగా.. తుషార్ దేశ్పాండేను రూ. 5 కోట్లకు తీసుకుంది. వాషింగ్టన్ సుందర్ రూ. 15.5 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
ఖలీల్ అహ్మద్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 7.5 కోట్లకు తీసుకోగా.. శివమ్ మావిని సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 2 కోట్లకు, లాకీ ఫెర్గూసన్ను రాజస్థాన్ రాయల్స్ రూ. 3.25 కోట్లకు తీసుకుంది. ఉమేశ్ యాదవ్ను కేకేఆర్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేయగా.. ఉమ్రాన్ మాలిక్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 3.25 కోట్లు తీసుకుంది. ప్రస్తుతం అశ్విన్ మాక్ ఆక్షన్ నెట్టింట చర్చనీయాంశమైంది.