ఐపీఎల్ 2025 మెగా వేలానికి ఒక్క రోజు ముందు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి భారత పేసర్గా చరిత్రకెక్కాడు.
ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్కు సారథ్యం వహిస్తున్న భువనేశ్వర్ కుమార్.. శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఈ అరుదైన ఫీట్ సాధించాడు.

ఢిల్లీ ఓపెనర్ యష్ దుల్ను ఔట్ చేసి 300 వికెట్ల క్లబ్లో చేరాడు. దేశవాళీ, ఐపీఎల్, అంతర్జాతీయ టీ20ల్లో కలిపి మొత్తం 287 మ్యాచ్లు ఆడిన భువనేశ్వర్ కుమార్.. మొత్తం 300 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన నాలుగో బౌలర్గా నిలిచాడు.
భువనేశ్వర్ కంటే ముందు యుజ్వేంద్ర చాహల్(354), పియూష్ చావ్లా(314), అశ్విన్(310) భువీ కంటే ముందున్నారు. పేసర్లలో భువనేశ్వర్ మినహా మరే భారత పేసర్ 300 వికెట్ల మైలు రాయి అందుకోలేదు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ 300 వికెట్ల మైలురాయికి 5 వికెట్ల దూరంలో ఉన్నాడు. బుమ్రా ఇప్పటి వరకు 233 టీ20 మ్యాచ్లు ఆడి 295 వికెట్లు తీసాడు.
గత సీజన్ వరకు సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడిన భువనేశ్వర్ కుమార్.. ఆది, సోమవారం జరిగే ఐపీఎల్ 2025 మెగా వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. భువీని మళ్లీ కొనుగోలు చేసేందుకు సన్రైజర్స్ ప్రయత్నించవచ్చు. టీ20 స్పెషలిస్ట్ బౌలర్గా అతనికి మంచి పేరు ఉంది. వేలంలో సునాయసంగా రూ. 5 నుంచి 10 కోట్ల మధ్య పలకనున్నాడు. అతను రూ. 2 కోట్ల కనీస ధరతో వేలం బరిలో నిలిచాడు.
ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 3 వికెట్లకు 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(43 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్స్లతో 102) సెంచరీతో రాణించగా.. హిమ్మత్ సింగ్(77 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. యూపీలో బుమ్రా, నితీష్ రాణా తలో వికెట్ తీసారు.
అనంతరం యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులే చేసి ఓటమిపాలైంది. నితీష్ రాణా(61), రింకూ సింగ్(70) రాణించినా ఫలితం లేకపోయింది. ఇషాంత్ శర్మ, సిమర్జిత్ సింగ్, ప్రిన్స్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. ఆయుష్ బదోనీ ఒక వికెట్ తీసాడు.