
కొలొంబో: టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ విచత్రమైన ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో వైస్ కెప్టెన్ హోదాలో ఆడుతున్న భువీ.. శ్రీలంకతో జరుగుతున్న జరుగుతున్న రెండో వన్డేలో నో బాల్ వేసాడు. నో బాల్ వేయడం ఘనత ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. భువీ అప్పుడెప్పుడో 2015 అక్టోబర్లో సౌతాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్లో నో బాల్ వేసాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అతను నో బాల్ వేయడం. ఈ ఐదేళ్ల కాలంలో అతను 3093 బంతులు బౌలింగ్ చేశాడు. కానీ ఒక్క నోబాల్ వేయలేదు.
శ్రీలంక ఇన్నింగ్స్ ఐదో ఓవర్ తొలి బంతిని నోబాల్ వేసిన భువీ.. ఫ్రీహిట్ అయిన ఆ మరుసటి బంతిని చాకచక్యంగా వేసి కట్టడి చేశాడు. అయితే ఐదేళ్ల పాటు భువీ నోబాల్ వేయకపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విచిత్రమైన ఫీట్కు ఫిదా అవుతున్నారు. సోసల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 9 ఏళ్లకు సుదీర్ఘ కెరీర్లో భువీ అతి తక్కువ నో బాల్స్ వేసాడు. మొత్తానికి 5 ఏళ్ల తర్వాత భువీ నోబాల్ వేసాడని ఒకరంటే.. భువీ నో బాల్ వేసోడోచ్ అని ఇంకొకరు సెటైర్లు పేల్చుతున్నారు. ప్రస్తుతం ఈ ఫీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
మొత్తంగా అంతర్జాతీయ కెరీర్లో 119 వన్డేలు, 21 టెస్ట్లు, 48 టీ20లు ఆడిన భువీ.. అతి తక్కువ ఎకానమీతో 247 వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. అవిష్కా ఫెర్నాండో(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 50), చరిత్ అసలంక(68 బంతుల్లో 6 ఫోర్లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించడంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 రన్స్ చేసింది. ఫెర్నాండో, చరిత్కు అండగా.. చివర్లో చమిక కరుణరత్నే(33 బంతుల్లో 5 ఫోర్లతో 44 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. మినోద్ భానుక(36), ధనుజంయ డిసిల్వా(36) కూడా పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/50), భువనేశ్వర్ కుమార్(3/54) మూడేసి వికెట్లు తీయగా.. , దీపక్ చాహర్ (2/53) రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్ దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ పృథ్వీ షా(13), హిట్టర్ ఇషాన్ కిషన్(1) వికెట్లు కోల్పోయింది. దాంతో క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే(16 బ్యాటింగ్)తో శిఖర్ ధావన్(29 బ్యాటింగ్) ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు.