హైదరాబాద్: ఐసీసీ వన్డే ప్రపంచకప్ సమయం ఆసన్నమవుతున్నా కొద్ది అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది. 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ జరుగుతుండటంతో టీమిండియానే విజేతగా నిలుస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ టైటిల్ కోసం గత 10 ఏళ్లుగా పడిగాపులు కాస్తున్న టీమిండియాకు ఈ సారి విజయం దక్కుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఈ మెగాటోర్నీ నేపథ్యంలో భారత్కు అన్ని అనుకూలతలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. టీమిండియాదే ప్రపంచకప్ అని ఆశలు రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ల్లో ఆతిథ్య దేశాలే విజేతగా నిలిచాయనే సెంటిమెంట్ ప్రచారంలో ఉండగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం భోళా శంకర్ సినిమా సెంటిమెంట్ కూడా టీమిండియాకు అనుకూలంగా ఉందని కామెంట్ చేస్తున్నారు.

టాలీవుడ్ వెటరన్ డైరక్టర్ మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ అభిమానుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ ముందు బోల్తాపడింది. మెగాస్టార్ చిరంజీవీ అంటే పడిచచ్చే అభిమానులు సైతం ఈ సినిమా బాలేదని నిట్టూరుస్తున్నారు.

అన్నయ్య తీవ్రంగా నిరాశపరిచాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వం బాలేదని మండిపడుతున్నారు. అయితే భోళా శంకర్ బోల్తా కొట్టడంతో టీమిండియా ప్రపంచకప్ విజేతగా నిలుస్తుందని ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన గణంకాలను కూడా ప్రస్తావిస్తున్నారు.
2011లో మెహర్ రమేశ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన శక్తి సినిమా కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యిందని, ఎన్టీఆర్ కెరీర్లోనే డిజాస్టర్గా నిలిచిందని గుర్తు చేస్తున్నారు. అయితే ఆ ఏడాది మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. 2013లో మెహర్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన షాడో అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది.
ఆ ఏడాది ధోనీ సారథ్యంలోని టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఆ తర్వాత డైరెక్షన్కు దూరంగా మెహర్ రమేశ్.. ఇన్నాళ్లకు మెగాస్టార్తో భోళా శంకర్ తీసి చేతులు కాల్చుకున్నాడు. ఈ క్రమంలోనే అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ప్రారంభమయ్యే వన్డే ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలుస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.