ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో బరిలోకి దిగిన అమెరికా జట్టుకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలియజేశారు. తమ క్రికెట్ టీమ్కు అమెరికా మొత్తం అండగా నిలుస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అయితే ఈ టోర్నీ ప్రారంభమై 24 గంటల తర్వాత ట్రంప్ ఈ పోస్ట్ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాకుండా అమెరికా తమ తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓటమిపాలైంది. ఈ ఓటమి తర్వాత ట్రంప్ విషెస్ చెప్పడంపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి.
శనివారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ 29 పరుగుల తేడాతో అమెరికాను ఓడించింది. ఆదివారం రాత్రి ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ అయిన ట్రూత్లో అమెరికా జట్టుకు అభినందనలు తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టారు. 'భారత్ వేదికగా క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోందని ఇప్పుడే తెలిసింది. ఈ టోర్నీలో ఆడుతున్న అమెరికా జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు. మన దగ్గర బలమైన జట్టు ఉంది, దేశమంతా మీ వెంటే ఉంది.’అని ట్రంప్ తన పోస్ట్లో పేర్కొన్నారు.
ఓడిపోయిన జట్టుకు, అది కూడా మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు ఆయన శుభాకాంక్షలు చెప్పడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'ట్రంప్ గారు.. మీరు ఏ కాలంలో ఉన్నారు?’అని సెటైర్లు పేలుస్తున్నారు. మరోవైపు అమెరికా క్రికెట్ టీమ్లో 9 మంది భారత సంతతి ఆటగాళ్లు ఉన్నారు. దాంతో అది అమెరికా జట్టు కాదని ఎన్ఆర్ఐ(ప్రవాస భారతీయుల) జట్టు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గ్రీన్ కార్డ్ భారతీయుల జట్టు అని సెటైర్లు పేల్చుతున్నారు.

అమెరికా .. ఎన్ఆర్ఐ టీమ్ ఏదైనా టీమిండియాకు మాత్రం చుక్కలు చూపించింది. అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో టీమిండియా టాపార్డర్ను కుప్పకూల్చింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును ఆదుకోవడంతో భారత్ 161 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టును హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లతో కట్టడి చేశాడు. చివరికి అమెరికా 132 పరుగులకే ఆలౌటై 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ట్రంప్ విషెస్ ఆలస్యమైనా.. అమెరికా జట్టు ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అమెరికా అద్భుతంగా ఆడిందని, ఇతర జట్లకు దబిడి దిబిడేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
1. మోనాంక్ పటేల్(గుజరాత్)
2. సౌరభ్ నేత్రావల్కర్(ముంబై మాజీ రంజీ ప్లేయర్, 2010 అండర్ 19 ప్రపంచకప్ భారత జట్టులో సభ్యుడు )
3. హర్మీత్ సింగ్(ముంబై మాజీ రంజీ ప్లేయర్, 2012 అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు)
4. మిలింద్ కుమార్(ఢిల్లీ మాజీ రంజీ ప్లేయర్, మాజీ ఐపీఎల్ ప్లేయర్)
5. శుభం రంజనే(ముంబై మాజీ రంజీ క్రికెటర్, మాజీ ఐపీఎల్ ప్లేయర్)
6. సాయితేజ ముక్కామల్ల(ఆంధ్రప్రదేశ్.. అమెరికాలోనే స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన యువ బ్యాటర్)
7. సంజయ్ కృష్ణమూర్తి(కర్ణాటక)
8. నోష్తుష్ కెంజిగే(కర్ణాటక)
9.జెస్సీ సింగ్(పంజాబ్)