రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయోత్సవ సంబరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఈవెంట్ ఆర్గనైజర్తో పాటు ఫ్రాంచైజీ చెందిన నలుగురు అధికారులను అరెస్ట్ చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 50 మంది వరకు గాయపడ్డారు.
18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలవడంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అందుకు తగ్గట్లుగానే ఆర్సీబీ ఫ్రాంచైజీ కూడా భారీ స్థాయిలో విజయోత్సవ వేడుకులను ఏర్పాటు చేసింది. అయితే భారీ స్థాయిలో అభిమానులు పాల్గొనడంతో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఓ ప్రత్యేక కమిటీతో కర్ణాటక ప్రభుత్వం న్యాయ విచారణ జరుపుతుంది. వాస్తవానికి ఈ వేడుకలకు బెంగళూరు పోలీసులు ముందుగా నిరాకరించారు. మరో రోజు జరుపుకోవాలని సూచించారు. కానీ ఆర్సీబీ ఫ్రాంచైజీ ఒత్తిడి చేసి మరి పర్మీషన్ తీసుకుంది. అయితే ఈ వేడుకలను ఉద్దేశించిన ఆర్సీబీ చేసిన ట్వీట్ ఈ ఘటనకు కారణమైందని పోలీసులు తమ విచారణలో గుర్తించారు.

ఆర్సీబీ చేసిన ట్వీట్తో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారని తేల్చారు. దాంతో ఆర్సీబీ ఫ్రాంచైజీతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లపై కేసు నమోదు చేశారు. ఆర్సీబీ ఎగ్జిక్యూటీవ్ నిఖిల్ సోసాలేను అరెస్ట్ చేశారు. డీఎన్ఏ ఈవెంట్ మేనేజర్ సునీల్ మాథ్యూన్ కూడా పోలీసులు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరో ఇద్దర్ని కూడా అరెస్ట్ చేశారు. సరైన అనుమతి లేకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధికారుల్లోని కొంతమంది కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అరెస్ట్ చేస్తారనే భయంతో కేఎస్సీఏ అధికారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అభిమానులను అదుపుచేయడంలో విఫలమైన పోలీసు అధికారులపై కూడా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బెంగళూరు నగర కమిషనర్ దయానంద్తో సహా పలువు పోలీసులు అధికారులను సీఎం సిద్ధరామయ్య సస్పెండ్ చేశారు. మరోవైపు ఈ కేసును కర్ణాటక హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరుపుతుంది. ఈ నెల 10వ తేదీలోపు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.