టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్కతా డాక్టర్ హత్యాచార కేసు విషయంలో గంగూలీ చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రజలను ప్రభావితం చేసే వ్యక్తులు ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
వారం రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. నేరస్థులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఆ వాదన సరికాదు..
ఈ ఘటనపై గంగూలీ స్పందిస్తూ.. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. అయితే ఈ ఒక్క ఘటనతో కోల్కతా, వెస్ట్ బెంగాల్ సురక్షితంగా లేదనే వాదన సరికాదని అభిప్రాయపడ్డాడు. 'ఇదో దురదృష్టకరమైన ఘటన. దోషులను కఠినంగా శిక్షించాలి. నిజంగా ఇది అత్యంత క్రూరమైన చర్య. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి ఘటనలు ఎక్కడైన జరగవచ్చు. అయితే ఈ ఒక్క ఘటనతో దేశంతో భద్రత లేదనే వాదన సరికాదు. భారత్ అద్భుతమైన దేశం. వెస్ట్ బెంగాల్.. ఇతర రాష్ట్రమైనా.. మంచి భద్రతనే ఉంది. కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలి. అమ్మాయిల రక్షణకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి'అని మీడియాతో గంగూలీ అన్నాడు.
దాదా.. ఇది దారుణం
ఈ వ్యాఖ్యలు చాలా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యంత క్రూరమైన హత్యాచార ఘటనను ఓ సాధారణ సంఘటనగా దాదా చెప్పడం దారుణమని మండిపడింది. 'గంగూలీ మీ వాఖ్యలు చాలా బాధకరంగా ఉన్నాయి. ఓ క్రికెటర్గా మిమ్మల్ని... మీటీవీ షోను నెత్తిన పెట్టుకున్నందుకు.. మహారాజాగా నిన్ను పిలుచుకున్నందుకు మాకు బుద్ది వచ్చేలా మాట్లాడారు. అత్యంత క్రూరమైన ఘటనను.. సాధారణ సంఘటనగా చెప్పడానకి మీకు నోరు ఎలా వచ్చింది?'అని శ్రీలేఖ మండిపడింది.
ఈ వ్యాఖ్యలపై గంగూలీ స్పందించాడు. తన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకున్నారో తెలియడం లేదన్నాడు. 'ఇది చాలా భయంకరమైన ఘటన. నేరస్థులకు కఠినమైన శిక్ష విధించాలని నేను డిమాండ్ చేశాను. తద్వారా మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదని కోరుకున్నాను.'అని వివరణ ఇచ్చాడు.