వెస్ట్ బెంగాల్లో విషాదం చోటు చేసుకోంది. ఆ రాష్టానికి చెందిన 22 ఏళ్ల యువ క్రికెటర్ ప్రియాజిత్ ఘోష్ జిమ్ చేస్తూ మృతి చెందాడు. బెంగాల్ రంజీ టీమ్తో పాటు భారత జట్టుకు ఆడాలనుకున్న ప్రియాజిత్ జీవితం అర్థాంతరంగా ముగిసింది. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా ప్రియాజిత్ కుప్పకూలిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. గుండె పోటు కారణంగానే ప్రియాజిత్ మరణించాడని వైద్యుల స్పష్టం చేశారు. బెంగాల్లోని బిర్భమ్ జిల్లా బోలాపూర్కు చెందిన ప్రియాజిత్ జిల్లా స్థాయి క్రికెట్ ఆడాడు.
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 16 జిల్లాస్థాయి టోర్నీలో అతను టాప్ స్కోరర్గా నిలిచాడు. రంజీ టీమ్లో చోటే లక్ష్యంగా సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఫిట్నెస్పై ఫోకస్ పెట్టిన ప్రియాజిత్.. తీవ్రమైన వ్యాయామలతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ప్రియాజిత్ అకాల మరణంతో బెంగాల్ క్రికెట్ వర్గాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. తన సహచర ఆటగాళ్లు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బెంగాల్..ఓ ప్రతిభావంతమైన బ్యాటర్ను కోల్పోయిందని అతని సహచరులు ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో ఈ మధ్య గుండె పోటు మరణాలు ఎక్కువయ్యాయి. ఇందులో 30 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది పంజాబ్లో జరిగిన టోర్నీలో ఓ బ్యాటర్ సిక్స్ కొట్టి గుండెపోటుకు గురయ్యాడు. సహచర ఆటగాళ్లు అతనికి సీవీఆర్ చేసినా ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ వారం ప్రారంభంలో హైదరాబాద్లో ఓ యువకుడు బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలాడు. అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. గుండె పోటుతో మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. తీవ్రమైన వ్యాయామాలు గుండెపై ఒత్తిడి చేస్తాయని, గుండె పోటుకు కారణమవుతాయని ఓ కార్టియాక్ సర్జన్ అన్నారు.